కూతురి అంత్యక్రియలకు వచ్చి  తండ్రి హఠాన్మరణం

came to Daughter's Funeral..Father died - Sakshi

చిల్పూరు(స్టేషన్‌ఘన్‌పూర్‌): కన్నకూతురి మరణాన్ని ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు.. ఒక్కగానొక్క బిడ్డ మృతిచెందడంతో విలవిలలాడాడు. పొంగుకొస్తున్న దుఃఖంతో కూతురిని కడసారి చూసుకొని తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై హఠాన్మణం చెందాడు. ఈ సంఘటన చిల్పూరు మండలంలోని క్రిష్ణాజీగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది. బంధువుల కథనం ప్రకారం.. కిృష్ణాజీగూడెం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు సంగి రాజు భార్య కవిత(32) కిడ్నీల వ్యాధితో బాధపడుతూ మంగళవారం మృతిచెందింది.

విషయం తెలియగానే లింగాలఘణపురం మండలం కుందారంలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు గుగ్గిల్ల అయిలయ్య, ఉప్పమ్మ కూతురి ఇంటికి చేరుకున్నారు. ఒక్కగానొక్క కూతురు మృతిచెందడంతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక నాయకులు వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కాగా సంగి రాజుకు కుమార్తెలు లావణ్య, సౌజన్య ఉన్నారు.

ఓ వైపు తల్లి, మరోవైపు తాతయ్య మృతిచెందడంతో వారి రోదనలు పలువురిని కంటతడిపెట్టించాయి. అప్పటివరకు కూతురు మృతిచెందాడనే దుఃఖంలో ఉన్న ఉప్పమ్మకు భర్త మృతిచెందాడని తెలియడంతో కన్నీరుమున్నీరైంది. కవితకు కూతుళ్లే తలకొరివి పెట్టారు. కాగా అయిలయ్య మృతదేహాన్ని కుందారం తీసుకెళ్లారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top