కన్నీరే మిగిలింది

Boy Died In Well Accidentally - Sakshi

ఆర్నెళ్ల కింద రోడ్డు ప్రమాదంలో భర్త..

నేడు బావిలో పడి కొడుకు మృతి

మోర్తాడ్‌: ఆర్నెళ్ల కింద రోడ్డు ప్రమాదంలో మరణించిన భర్త లేని లోటుతో విషాదంలో ఉన్న మందగొల్ల మౌనికను మరో విషాదం వెంటాడింది. వేసవి సెలవుల కోసం తన పెద్దమ్మ ఇంటికి వెళ్లిన మందగొల్ల సాయి చైతన్య(11) బుధవారం ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. దీంతో తీరని దుఖంలో ఉన్న మౌనికకు ఇక కన్నీరే మిగిలింది. వరుస ప్రమాదాలు వెంటాడటంతో మౌనిక వేదన వర్ణనాతీతంగా ఉంది. మోర్తాడ్‌ మండలం వడ్యాట్‌కు చెందిన ముత్తెన్న మోర్తాడ్‌ నుంచి తన సొంత గ్రామానికి బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్ని మరణించాడు. దీంతో పుట్టెడు దుఖంలో ఉన్న ముత్తెన్న భార్య తన కొడుకులను సాకుతూ కాలం వెళ్లదీస్తోంది. అయితే సాయి చైతన్య మౌనిక సోదరి స్వగ్రామం జగిత్యాల్‌ జిల్లా మల్లాపూర్‌కు వేసవి సెలవుల కోసం వెళ్లాడు. భర్త ప్రమాదంలో మరణించగా ఆ దుఖం నుంచి తేరుకోకముందే పెద్ద కొడుకు మరణించడంతో మౌనిక వేదనను చూసి అందరూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top