అయ్యో.. ఎంత ఘోరం జరిగిపోయింది!
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బైకుపై వెళుతున్న ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం.. విషాదానికి దారితీసింది. ఈ ప్రయత్నంలో బైక్పై ఉన్న తొమ్మిదేళ్ల బాలుడు మృత్యవాతపడ్డాడు. ఈ ఘటన ఉప్పరపేటే పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బెంగళూరు నగరానికి చెందిన రాజన్న మనవడు దర్శన్ (9), మనవరాలు నిహారిక విద్యావర్ధక పాఠశాలలో చదువుకుంటున్నారు.
రాజన్నశనివారం మధ్యాహ్నం వారిని పాఠశాల నుంచి హోండా యాక్టివా వాహనంపై ఇంటికి తీసుకెళుతుండగా.. దారిలో మేజస్టిక్ సంగోళ్లి రాయణ్ణ సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తున్నారు. హెల్మెట్ ధరించని రాజణ్ణ పోలీసులు పట్టుకుంటారనే భయంతో వారి నుంచి తప్పించుకోవడానికి తన వాహనాన్ని పక్కనే ఉన్న రోడ్డుకు మళ్లించాడు. ఈ క్రమంలో వాహనంపైనుంచి మనవడు దర్శన్ కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బాలుడిపై దూసుకెళ్లింది. ప్రమాదంలో బాలుడు ఘటనాస్ధలంలోనే దుర్మరణం పాలయ్యాడు. కళ్ల ముందు మనవడు మృత్యవాత పడటంతో రాజణ్ణ కన్నీరుమున్నీరయ్యారు.
సంబంధిత వార్తలు