టీడీపీ నేత అహ్మద్‌ అలీపై మరో కేసు

Another Case Registered Against Ahmed Ali Telugu Desam Party - Sakshi

భవన నిర్మాణ కార్మికుడిని చంపుతానంటూ బెదిరింపు 

నిందితుడిని కోర్టులో హాజరుపరచిన పోలీసులు 

సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ అమలుకు న్యాయమూర్తి ఆదేశం 

సాక్షి, కదిరి: తెలుగుదేశం పార్టీ కదిరి పట్టణ అధ్యక్షుడు అహ్మద్‌ అలీపై శనివారం మరో కేసు నమోదైంది. చైర్మన్‌ వీధికి చెందిన ఇస్మాయిల్‌కు ఇంటి పట్టా ఇప్పిస్తామని చెప్పి మోసగించడంతో పాటు బాధితుడినే చంపుతానని చెదిరించినందుకు ఆయనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. అహ్మద్‌ అలీ 2007లో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇస్మాయిల్‌కు ఇంటి స్థలం ఇప్పిస్తానని రూ.1250 నగదు తీసుకున్నాడు. తర్వాత ఇంటి పట్టా కోసం మరో రూ.1500 తీసుకున్నాడు. అయితే ఇప్పటి దాకా ఇంటి పట్టా ఇప్పించిన పాపానపోలేదు. కొన్నేళ్లుగా ఆయన ఇంటి చుట్టూ బాధితుడు తిరిగినా కనికరం చూపలేదు. ఇదే విషయమై శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు హిందూపూర్‌ రోడ్‌లో గట్లు సమీపంలోని నర్సరీ దగ్గర అహ్మద్‌ అలీ ఉన్నాడని తెలుసుకొని బాధితుడు అక్కడికి వెళ్లాడు. తనకు ఇంటి పట్టా అయినా ఇప్పించండి.. లేదంటే తాను ఇచ్చిన డబ్బు వాపసు ఇవ్వండి’ అని ప్రాధేయ పడ్డాడు.

ఇందుకు ఆయన ‘రేయ్‌ ఏమి బాకీరా నీకు.. ఇంటి పట్టా లేదు..ఏమీ లేదు. ఇక్కడి నుండి వెళ్లకపోతే చంపుతా’ అంటూ దాడికి దిగాడు. దీంతో ఇస్మాయిల్‌ వెంట వెళ్లిన రామకృష్ణ అనే వ్యక్తి అతని బారి నుంచి కాపాడాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు రూరల్‌ సీఐ నిరంజన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని నిందితుడు అహ్మద్‌ అలీని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇతనిపై పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కూడా భవన నిర్మాణ కారి్మకులను మోసగించారంటూ ఈ మధ్యే కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇతనికి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇచ్చి పోలీసులు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలనే నిబంధనతో ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు. ఈ కేసులో కూడా న్యాయమూర్తి అదే తీర్పును వెలువరించారు. దీంతో జైలుకెళ్తారనుకున్న వ్యక్తి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు అందుకుని విడుదలయ్యారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top