చెప్పుల పంచాయతీ.. వ్యక్తి హత్య | Altercation for Footwear, man killed | Sakshi
Sakshi News home page

Mar 25 2018 12:34 PM | Updated on Aug 29 2018 8:36 PM

Altercation for Footwear, man killed - Sakshi

హంతకుడిని గుర్తిస్తున్న డాగ్‌స్క్వాడ్‌,రక్తపు మడుగులో దాసరి మూగెన్న

సాక్షి, ఆత్మకూరు రూరల్‌: తన చెప్పులు కనబడకపోవడానికి చిన్నాన్నే కారణమని భావించిన ఓ వ్యక్తి మద్యం మత్తులో అతడిపై దాడికి దిగాడు. తనను తాను రక్షించుకునే క్రమంలో చిన్నాన్న ఆ వ్యక్తిని నరికి చంపాడు. పోలీసుల వివరాల మేరకు..ఆత్మకూరు మండలం అమలాపురం చెంచుగూడేనికి చెందిన దాసరి మూగెన్న (26) ఇటీవల కొత్త చెప్పులు కొన్నాడు. తన చిన్నాన్న అయిన మూగెన్న ఇంటివద్దకు శుక్రవారం రాత్రి ఏదోపనిపై వెళ్లి తిరిగి వచ్చిన తరువాత తన చెప్పులు లేక పోవడాన్ని గుర్తించాడు.  వాటిని చిన్నాన్నే కాజేశాడన్న నిర్ణయానికి వచ్చి ఆయనతో గొడవకు దిగాడు.

మద్యం మత్తులో ఉన్న అతడు ఏకంగా విల్లంబులుతో దాడి చేశాడు. ఈక్రమంలో ఓ బాణం చిన్నాన్న చేతిగుండా దూసుకుపోయింది. దీంతో అతడు ప్రాణభయంతో తన ఇంట్లోకి దూరి తలుపులు వేసుకుని గడియ పెట్టుకున్నాడు. అయినా మూగెన్న ఆగకుండా తలుపుపై గొడ్డలితో దాడి చేయడంతో తలుపు గడియ ఊడిపోయింది. దీంతో మూగెన్న గదిలో ఉన్న చిన్నాన్నపై గొడ్డలితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అది గమనించిన చిన్నాన్న కుమారుడైన మూగెన్న అడ్డువెళ్లాడు. అతడిపై దాడి చేయడంతో కడుపులో నుంచి పేగులు బయటకు రావడంతో అక్కడే పడిపోయాడు.

ఇంతలో మూగెన్న నుంచి చిన్నాన్న గొడ్డలి గుంజుకుని అతడిపై విచక్షణరహితంగా దాడి చేశాడు. తీవ్రరక్తస్రావం కావడంతో  దాసరి మూగెన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన కుమారుడిని ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆత్మకూరు సీఐ బత్తల క్రిష్ణయ్య, ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తమ సిబ్బందితో ఘటనస్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీ నిర్వహించారు. నిందితుడు మూగెన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. శనివారం డీఎస్పీ మాధవరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement