
లక్ష్మీప్రసాద్ ఆస్తులను లెక్కిస్తున్న అధికారి
విజయవాడ: పటమట ప్రాంతంలో ఉంటున్న వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారి ఇంట్లో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. లెహరీ హాస్పటల్ సమీపంలోని వివేకానందనగర్, తంగెళ్లమూడి వారి వీధిలో సాయి మానస అపార్ట్మెంట్స్ ప్లాట్ నంబరు 502లో విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ జి.లక్ష్మీప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేశారు. ఈ సోదాల్లో భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు పాస్ పుస్తకాలు లభించాయి. సాయిబాబా అనే వ్యక్తి పేరుతో రూ.కోటికి 10 ప్రాంసరీ నోట్లు ద్వారా అప్పు ఇచ్చినట్లు ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. నగరంతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం, గుంటూరుతో పాటు మొత్తం 20చోట్ల ఏకకాలంలో ఏసీబీ ఈ సోదాలు నిర్వహించింది.