
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ ‘ఫోక్స్వ్యాగన్ గ్రూప్’ తాజాగా భారత్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. 2019–21 మధ్యకాలంలో 1 బిలియన్ యూరోలు (దాదాపు రూ.7,900 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తామని పేర్కొంది. ‘2021 నాటికి భారత్లో బిలియన్ యూరోల పెట్టుబడులు పెడతాం. మేం ఒక మార్కెట్లో చేయబోయే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది’’ అని స్కోడా ఆటో సీఈవో బెర్న్హర్డ్ మేయర్ తెలిపారు.
ఇండియాలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఫోక్స్వ్యాగన్ గ్రూప్ గత వారం తన భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన భారత్ కార్యకలాపాలకు స్కోడా ఇండియా బాధ్యత వహిస్తుందని పేర్కొంది. అలాగే ఇండియా 2.0 ప్రాజెక్ట్ను కూడా ఆవిష్కరించింది.
సంస్థ ఇందులో భాగంగా 2020 రెండో అర్ధభాగంలో సబ్–కాంపాక్ట్ ఎంక్యూబీ ఏవో ప్లాట్ఫామ్పై తొలి ఎస్యూవీ మోడల్ను మార్కెట్లోకి తీసుకురానుంది. పుణేలో ఇంజినీరింగ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. ఔరంగాబాద్, పుణే ప్లాంట్ల తయారీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. కంపెనీ 2025 నాటికి ఇండియన్ మార్కెట్లో 5 శాతాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది.