వారికి భారీ జీతాలు సమంజసమే - టీసీఎస్‌

TCS spend on employees is justified: Tata Sons chairman N Chandrasekaran - Sakshi

వార్షిక వేతనం కోటి రూపాయలు దాటిన వారు 100కు పై మాటే

దీనిపై టీసీఎస్‌ వార్షిక సమావేశంలో ఆందోళన 

వారికి ఆ జీతాలు న్యాయమే - చంద్రశేఖరన్‌

సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో  కరోడ్‌పతిల సంఖ్య ఇపుడు హాట్‌ టాపిగా నిలిచింది. అయితే  టీసీఎస్‌ ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లిస్తోందన్న ఆరోపణలను టాటా గ్రూపులో మరో సంస్థ  టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ తోసిపుచ్చారు. టీసీఎస్‌ వృద్ధికి, అద్భుతమైన ఫలితాలను సాధించిన ఘనత టీసీఎస్‌ మేనేజ్‌మెంట్‌కు దక్కు తుందన్నారు. ఇందుకు వారికి తగిన ప్రతిఫలం అందివ్వాలని సంస్థ  భావించిందని చెప్పారు. ఉద్యోగులను నిలుపుకోవడంపై ప్రధానంగా తాము ఎక్కువ దృష్టి పెట్టామని టీసీఎస్‌ సీఎండీ రాజేష్ గోపీనాథన్‌ చెప్పారు. అలాగే నూతన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వృద్ధి-ఆధారిత కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే డిజిటల్ ఇండియా చొరవను పునరుద్ఘాటించే అవకాశం ఉందన్నారు. కరెన్సీలో దీర్ఘ కాల స్థిరత‍్వం కోసం తాము ఎదురు చూస‍్తున్నామని ఆయన చెప్పారు.

టీసీఎస్‌లో 100 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక జీతం అందుకుంటున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  ఈ ఉద్యోగుల్లో 25 శాతం మంది ఉద్యోగులు  టీసీఎస్‌లోనే కరీర్‌ ప్రారంభించినవారు కావడం విశేషం. ఈ వివరాలను  ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

2017-18 ఆర్థిక సంవత్సరంలో  టీసీఎస్‌లో కోటిపైగా వార్షిక వేతనం అందుకున్నవారి సంఖ్య 91.   2018-19 సంవత్సరానికి ఈ సంఖ్య 103కి చేరింది. సీఈవో రాజేశ్ గోపినాథన్, సీఓఓ  ఎన్‌జీ సుబ్రహ్మణ్యం, విదేశాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.  టిసిఎస్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, పబ్లిక్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ డెబాషిస్ ఘోష్ రూ .4.7 కోట్లు సంపాదించారు; బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ హెడ్ కృష్ణన్ రామానుజం రూ .14.1 కోట్లు,  బ్యాంకింగ్ అండ్‌  ఫైనాన్షియల్ సర్వీసెస్,  ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ కె. కృతివాసన్ సంవత్సరానికి రూ .4.3 కోట్లకు పైగా  వేతనాన్ని అందుకున్నారు. రూ.1 కోటికిపైగా జీతం అందుకుంటున్న వారిలో అత్యధిక వయస్కులు ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ బరీంద్ర సన్యాల్  (72)గా ఉండగా, అతి తక్కువ వయస్కులు 40 ఏళ్ల వయసు ఉద్యోగి.

కాగా ఇన్ఫోసిస్‌లో ఇలా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 60గా ఉంది. స్టాక్మార్కెట్ లాభాలకు అనుగుణంగానూ తమ ఉద్యోగులకు టీసీఎస్ ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తుంది. కానీ ఇన్ఫోసిస్ మాదిరిగా  టిసిఎస్ ఉద్యోగులకు స్టాక్ ఆధారిత ప్రోత్సాహకాలు లభించవు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top