పెరిగిన టాటా కమ్యూనికేషన్స్‌ నష్టాలు

Tata Communications losses widen to 199 crore in Q4 FY19 - Sakshi

రూ.199 కోట్లకు చేరిన నికర నష్టం 

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సేవలందించే టాటా కమ్యూనికేషన్స్‌ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో మరింతగా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.121 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.199 కోట్లకు పెరిగాయని టాటా కమ్యూనికేషన్స్‌ తెలిపింది.  ఆదాయం 5 శాతం వృద్ధి తో రూ.4,244 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు ఎస్‌టీటీ తై సెంగ్‌ కంపెనీలో గుడ్‌విల్‌ ఇంపెయిర్‌మెంట్‌ నష్టాలు రూ.173 కోట్ల మేర రావడంతో గత క్యూ4లో నష్టాలు పెరిగాయని వివరించారు. 

ఆదాయం 2 శాతం డౌన్‌..
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.329 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.82 కోట్లకు తగ్గాయని కుమార్‌ తెలిపారు. ఆదాయం 2 శాతం క్షీణించి రూ.16,525 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. కంపెనీ డేటా వ్యాపారం మంచి వృద్ధిని సాధిం చిందని, భవిష్యత్తు వృద్ధికి ఈ డేటా వ్యాపారం చోదక శక్తి కాగలదని వివరించారు. 
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టాటా కమ్యూనికేషన్స్‌ షేర్‌ 1.1 శాతం నష్టంతో రూ.559 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top