యాంబీ వ్యాలీ వేలానికి సహకరించట్లేదు..!

Sebi files contempt plea against Sahara on Aamby Valley sale

సహారాపై సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌  

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక యాంబీ వ్యాలీ వేలానికి సహారా సహకరించడం లేదని పేర్కొంటూ సహారాపై సుప్రీంకోర్టులో మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. సత్వరం ఈ పిటిషన్‌పై విచారణ జరపాలని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ని సెబీ న్యాయవాది కోరారు. మంగళవారం నుంచీ వేలం ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నా సహారా సహకరించకపోవడం వల్ల ఆలస్యం అవుతోందని వివరించారు.

అయితే కేసును విచారిస్తున్న బెంచ్‌లోని  మరో ఇరువురు న్యాయమూర్తులతో చర్చించి, పిటిషన్‌ విచారణ తదుపరి తేదీని తెలుపుతామని జస్టిస్‌ గొగోయ్‌ చెప్పారు. కేసును విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో సభ్యులైన ప్రధాన న్యాయమూర్తి మిశ్రా, జస్టిస్‌ శిక్రీలు వేర్వేరు బెంచ్‌ల్లో (కాంబినేషన్లలో) ఉన్న నేపథ్యంలో జస్టిస్‌ గొగోయ్‌ ఈ విషయం తెలిపారు. సహారా  సంస్థలు రెండు ఇన్వెస్టర్లకు దాదాపు రూ. 37,000 కోట్లు చెల్లించాల్సిన కేసులో యాంబీ వ్యాలీ వేలానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top