
చార్జీలపై వెనక్కి తగ్గిన పేటీఎం
క్రెడిట్ కార్డుల ద్వారా మొబైల్ వాలెట్ టాప్ అప్లపై 2 శాతం చార్జీల విధింపుపై పేటీఎం వెనక్కి తగ్గింది.
క్రెడిట్ కార్డులతో టాప్ అప్లపై 2% చార్జీల ఉపసంహరణ
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుల ద్వారా మొబైల్ వాలెట్ టాప్ అప్లపై 2 శాతం చార్జీల విధింపుపై పేటీఎం వెనక్కి తగ్గింది. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో చార్జీలు ఉపసంహరిస్తున్నట్లు వెల్లడిం చింది. తాము ఇలాంటి విషయాల్లో అత్యంత వేగంగా స్పందిస్తామని, కేవలం ఇరవై నాలుగ్గంటల వ్యవధిలోనే నిర్ణయాన్ని సవరించుకున్నామని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 2016లో మ్యాగీ నూడుల్స్ విషయంలో నెస్లే ఇండియా సోషల్ మీడియాలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే తలెత్తితే ఏ విధంగా బైటపడతారన్న ప్రశ్నపై స్పందిస్తూ ఆయన ఈ విషయాలు వివరించారు.
భారతీయులు చెప్పుడు మాటలకు ఇట్టే పడిపోతారని, దీంతో ఇక్కడ ఏ వ్యాపారాన్నైనా నిర్మించడం కంపెనీలకు చాలా కష్టమైన వ్యవహారమని శర్మ చెప్పారు. టెక్నాలజీపై పట్టుగల కొందరు.. చాలా తెలివిగా క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘కేవలం తెలివైన వారే క్రెడిట్ కార్డు నుంచి డబ్బును బ్యాంకులో వేసుకుని అత్యంత తక్కువగా 0.1% వడ్డీ మీద తిప్పగలరు. ఇక ట్వీటర్ అనేది చాలా అద్భుతమైన మాధ్యమం.
మన అభిప్రాయమే జనాల అందరి అభిప్రాయం అన్న భావన కలిగింపజేస్తుంది‘ అంటూ వ్యాఖ్యానించారు. క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన టాప్ అప్ మొత్తాలను తమ నెట్వర్క్లో కొనుగోళ్లకు ఉపయోగించకుండా.. కొందరు యూజర్లు తమ బ్యాంకు ఖాతాలకు మళ్లించుకుంటుండటాన్ని గమనించిన పేటీఎం.. ఈ తరహా టాప్ అప్లపై చార్జీలు విధించిన సంగతి తెలిసిందే.