
చరిత్రాత్మక గరిష్టానికి మార్కెట్
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లో ముగిశాయి.
⇒ ఇంట్రాడే, క్లోజింగ్లో రెండో రోజూ రికార్డులే
⇒ 104 పాయింట్ల లాభంతో 28,889కు సెన్సెక్స్
⇒ 34 పాయింట్ల లాభంతో 8,730కు నిఫ్టీ
మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల్లో ముగిశాయి. బుధవారం కూడా సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త గరిష్ట స్థాయిలను చేరాయి. మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితులు, రానున్న బడ్జెట్పై ఆశాభావం.... ఇన్వెస్టర్ల సెంటిమెంట్ జోరును కొనసాగించాయి. అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండటంతో సెన్సెక్స్ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయి, 28,958ను, నిఫ్టీ 8,742లను తాకాయి.
చివరకు 104 పాయింట్ల లాభంతో 28,889 వద్ద సెన్సెక్స్ ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 34 పాయింట్ల లాభంతో 8,730 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక గరిష్ట స్థాయిలు. చైనా షాంఘై కాంపోజిట్ సూచీ 4.7 శాతం పెరగడం మార్కెట్ సెంటిమెంట్కు మరింత జోష్నిచ్చిందని ట్రేడర్లు పేర్కొన్నారు. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,542 పాయింట్లు(5.6 శాతం) లాభపడింది. ఇదేజోరు కొనసాగితే నిఫ్టీ త్వరలోనే 9,000 పాయింట్లకు చేరుతుందని నిపుణులంటున్నారు.
బడ్జెట్ రోజు ట్రేడింగ్?
2015-16 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను కేంద్రం వచ్చే నెల 28(శనివారం)న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది. సాధారణంగా స్టాక్ మార్కెట్లు శనివారం పనిచేయవు. అయితే బడ్జెట్ సందర్భంగా ట్రేడింగ్ నిర్వహించాలని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు భావిస్తున్నాయి. సెబీ అనుమతిస్తే ఆ రోజు ట్రేడింగ్ నిర్వహిస్తామని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ప్రతినిధిలు పేర్కొన్నారు. కాగా అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ సిన్హా పేర్కొన్నారు.
రూ.100 లక్ష కోట్లకు ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాప్
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)లోని కంపెనీల మార్కెట్ విలువ బుధవారం రూ.100 లక్షల కోట్ల మార్క్ను దాటింది. ఈ మార్క్ను బీఎస్ఈ కంపెనీలు గత ఏడాది నవంబర్లోనే అధిగమించాయి.