
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త కొత్త నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. కొత్త డినామినేషన్ నోట్లనే కాక, ప్రస్తుతమున్న వాటికి కొత్త నోట్లను తీసుకొస్తోంది. తాజాగా100 రూపాయి కరెన్సీ నోట్లు కొత్తవి మార్కెట్లోకి రాబోతున్నాయట. 2018 ఏప్రిల్ నుంచి ఈ నోట్ల ప్రింటింగ్ను ప్రారంభించాలని ఆర్బీఐ భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. రూ.200 డినామినేషన్ నోట్ల ప్రింటింగ్ పూర్తి అయిన తర్వాత వెంటనే ఈ కొత్త రూ.100 నోట్ల ప్రింటింగ్ను మొదలుపెట్టాలని ఆర్బీఐ చూస్తుందని తెలిపాయి. కొత్త రూ.200 నోట్లు పూర్తిగా సిస్టమ్లోకి రావాలంటే కనీసం ఆరు నెలలైనా సమయం పడుతుందని తెలుస్తోంది. కొత్త సెక్యురిటీలో ఈ నోట్లను ముద్రించనున్నట్టు సమాచారం.
ప్రస్తుతమున్న రూ.100 డినామినేషన్ నోట్లు సిస్టమ్లో ఉంటాయని, కానీ మెల్లమెల్లగా వాటిని వెనక్కి తీసుకోనున్నట్టు హిందూస్తాన్ టైమ్స్ రిపోర్టు చేసింది. కొత్త రూ.100 నోట్ల సైజులో ఎలాంటి మార్పులు ఉండబోవట. ఏటీఎంలలో సరిపోయే విధంగానే వీటిని తయారుచేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం, కొత్తగా రూ.2వేల నోట్లు, రూ.500 నోట్లు, రూ.200 నోట్లు, రూ.50 నోట్లను ఆర్బీఐ మార్కెట్లోకి తీసుకొచ్చింది. చిల్లర కొరతకు అడ్డుకట్ట వేయడానికి చిన్న డినామినేషన్ నోట్ల విడుదలపై ఆర్బీఐ ఎక్కువగా దృష్టిసారించింది.