ప్రైడో క్యాబ్స్‌ వస్తున్నాయ్‌! | New Cab Services Soon in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రైడో క్యాబ్స్‌ వస్తున్నాయ్‌!

Aug 29 2019 10:34 AM | Updated on Aug 29 2019 10:34 AM

New Cab Services Soon in Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: క్యాబ్‌ అగ్రిగేటర్ల మార్కెట్‌ వేడెక్కుతోంది. ఓలా, ఉబెర్‌కు పోటీగా హైదరాబాద్‌లో ఇటీవలే టోరా క్యాబ్స్‌ ఆరంభం కాగా... భారీ పెట్టుబడులు, టెక్నాలజీ మద్దతుతో మరో సంస్థ రంగంలోకి దిగుతోంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్‌ గ్రూప్‌.. వెంకట ప్రణీత్‌ టెక్నాలజీస్‌ పేరిట ‘ప్రైడో’ యాప్‌తో ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. వచ్చే నెల 29న హైదరాబాద్‌లో సేవలను ప్రారంభించుంది. రూ.100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని, సుమారు 20 వేల క్యాబ్స్‌తో ఆరంభించనున్నామని ఫౌండర్‌ అండ్‌ సీఈఓ నరేంద్రకుమార్‌ కామరాజు ఈ సందర్భంగా ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...

డ్రైవర్లది అసంఘటిత రంగమే. వాహనం తనదే. నడిపేదీ తనే! కానీ, లాభాలు పొందేది అగ్రిగేటింగ్‌ కంపెనీలు. దీనికి చెక్‌ పెడుతూ... డ్రైవర్లకు తగిన గౌరవం, ప్రతిఫలం అందించాలనే లక్ష్యంతోనే ప్రైడోను ఏర్పాటు చేశాం. వారం రోజులుగా డ్రైవర్స్‌ పార్టనర్స్‌ నమోదు మొదలైంది. 4 వేల మంది రిజిస్టరయ్యారు. మహిళ డ్రైవర్లను కూడా పార్ట్‌నర్స్‌గా నమోదు చేస్తున్న విషయం ఇక్కడ గమనార్హం.  100 మంది మహిళ పార్టనర్‌ డ్రైవర్స్‌తో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాం. తెలంగాణ పోలీస్‌ విభాగం ‘హ్యాక్‌ ఐ’ యాప్‌తో ఇది అనుసంధానమై ఉంటుంది. దీంతో కస్టమర్లకు భద్రత, రక్షణ ఉంటుంది.

డ్రైవర్‌ కమీషన్‌ 10 శాతం..
ఇతర క్యాబ్‌ అగ్రిగేటర్లు 30–40 శాతం కమిషన్‌ తీసుకుంటున్నారు. ప్రైడోలో ఇది 10 శాతమే. తొలి 15 రోజులూ డ్రైవర్లు ఎలాంటి కమీషన్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ప్రతి రైడ్‌పై 10 శాతం కమీషన్‌ ఉంటుంది. నెలకు రూ.50 వేల పైన చేస్తే కమీషన్‌ తగ్గుతుంది కూడా. ప్రైడో బ్రేక్,  జీరో ఆన్‌ బోర్డింగ్‌ చార్జెస్, పార్కింగ్‌ ఫెసిలిటీ వంటి రకరకాల ఆప్షన్స్‌ ఉంటాయి. యాప్‌లో ఫిమేల్‌ డ్రైవర్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాని మీద క్లిక్‌ చేస్తే మహిళ డ్రైవర్‌ వస్తారు. అయితే ఈ ఆప్షన్‌ జియో ఫెన్సింగ్‌తో అనుసంధానమై ఉంటుంది.

డ్రైవర్ల కోసం సంక్షేమ నిధి..
త్వరలోనే ప్రైడో పార్టనర్‌ వెల్‌ఫేర్‌ ఫండ్‌ను (పీపీడబ్ల్యూఎఫ్‌) ఏర్పాటు చేయనున్నాం.

ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఒప్పందం..
ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఓ ప్రముఖ కార్ల తయారీ కంపెనీతో ఒప్పందం చేసుకుంటున్నాం. 

నవంబర్‌ నుంచి ఉద్యోగుల రవాణా సేవలు..
సెప్టెంబర్లో సేవలు ఆరంభించాక... నవంబర్‌ నుంచి బీ2బీ విభాగంలో ఉద్యోగుల ట్రాన్స్‌పోర్ట్‌ సేవల్ని ప్రారంభిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement