ఐపీఓ ఆరంభం అదుర్స్‌! 

MT Educare plans IPO for online educational technology platform - Sakshi

2019లో ఇన్వెస్టర్లకు లాభాలు పంచిన పబ్లిక్‌ ఆఫర్లు...

ఆరు లిస్టవగా...    ఐదు కంపెనీలు లాభాల్లో

ఎంఎస్‌టీసీ ఒక్కటే నష్టాల్లో   

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లో ఈ ఏడాది కొత్తగా లిస్టయిన కంపెనీలు ఇన్వెస్టర్లకు మంచి రాబడులే ఇచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆరు కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కాగా... ఐదు కంపెనీలు ఇష్యూ ధర కంటే అధిక ధరకే ట్రేడవుతున్నాయి. ఈ కంపెనీలన్నింట్లో రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ అధిక లాభాలనిచ్చింది. ఈ నెల 11న స్టాక్‌ మార్కెట్లో లిస్టైన ఈ కంపెనీ ఇష్యూ ధర కంటే 26 శాతం అధిక ధర వద్ద ట్రేడవుతోంది.  
వైర్లు, కేబుళ్లు తయారు చేసే పాలీక్యాబ్‌ ఇండియా షేర్‌ ఈ నెల 16న స్టాక్‌ మార్కెట్లో అరంగేట్రం చేసింది. ఇష్యూ ధరతో పోల్చితే 19 శాతం లాభపడింది. ఇక ఛాలెట్‌ హోటల్స్‌ లిమిటెడ్‌ 17 శాతం, క్సెల్ప్‌మ్యాక్‌  డిజైన్‌ అండ్‌ టెక్‌ షేర్‌ 9 శాతం చొప్పున పెరిగాయి. ఈ రెండు షేర్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాయి. ఇక ఈ నెల 15న స్టాక్‌ మార్కెట్లో లిస్టైన మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌ షేర్‌ 7 శాతం లాభపడింది. 

కలసివచ్చిన మార్కెట్‌ ట్రెండ్‌... 
ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లో కొత్తగా లిస్టైన ఈ ఆరు కంపెనీలు తమ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ప్రైస్‌బ్యాండ్‌ను ఆకర్షణీయంగా నిర్ణయించాయని విశ్లేషకులంటున్నారు. అంతేకాకుండా మార్కెట్‌ ట్రెండ్‌ పాజిటివ్‌గా ఉండటం కూడా కలసిరావడంతో ఈ కొత్త కంపెనీలు మంచి లాభాల్లో  ట్రేడవుతున్నాయని వారు పేర్కొన్నారు.  

ఒక్క కంపెనీయే కిందకు..
ఈ ఏడాది లిస్టైన కంపెనీల్లో ఒక్క కంపెనీయే ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ ఏడాది మార్చి 29న స్టాక్‌ మార్కెట్లో లిస్టైన ఎమ్‌ఎస్‌టీసీ షేర్‌ 18 శాతం పతనమైంది. ఇన్వెస్టర్ల నుంచి స్పందన సరిగ్గా లేకపోవడంతో ఈ ఐపీఓను పొడిగించారు. అంతేకాకుండా ప్రైస్‌బ్యాండ్‌ను కూడా సవరించారు. కాగా నియోజెన్‌ కెమికల్స్‌ ఐపీఓ గత శుక్రవారమే పూర్తయింది. ఈ షేర్‌ ఈ నెల 8న స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top