
సాక్షి, ముంబై: వరుస రికార్డు స్థాయిలతో మురిపించిన దేశీయ స్టాక్మార్కెట్లు చల్లబడ్డాయి. ఆరంభ నుంచీ నష్టాల్లో ట్రేడ్ అయిన కీలక సూచీలు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. చివరి ఆఖరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 53పాయింట్ల నష్టంతో 32,213వద్ద, నిఫ్టీ 28పాయింట్లు క్షీణించి 10,335వద్ద ముగిసింది.
ముఖ్యంగా మెటల్, ఆటో రంగాల్లో నష్టపోగా, రియల్టీ బాగా లాభపడింది. అలాగే ప్రభుత్వ రీక్యాపిటలైజేషన్ తో భారీగా లాభపడిన ప్రభుత్వ రంగ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఓబీ, పీఎన్బీ, యూనియన్, ఐడీబీఐ, ఆంధ్రా బ్యాంక్,కెనరా, స్టేట్బ్యాంక్, ఓబీసీ, సిండికేట్ బ్యాంక్ నష్టపోగా యాక్సిస్బ్యాంక్, ఆర్కాం, సన్టీవీ, బ్యాంక్ఆఫ్ఇండియా, బీహెచ్ఈఎల్, హెచ్సీఎల్ టెక్, డాబర్ ఇండియా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, లాభపడ్డాయి. పీఎఫ్సీ, ఎల్ఐసీ హౌసింగ్, వేదాంత, గెయిల్, ఇన్ఫోసిస్, నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.