ఉద్యోగాలే కాదు... స్థలాల్లోనూ కోతే! | IT Office Placements Transactions | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలే కాదు... స్థలాల్లోనూ కోతే!

Jan 17 2018 1:20 AM | Updated on Sep 27 2018 4:47 PM

IT Office Placements Transactions - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు ఉద్యోగులను తొలగించటం మాత్రమే కాకుండా... స్థలాల విషయంలోనూ కోతలు విధించాయి. 2017లో దేశంలోని మొత్తం కార్యాలయాల లావాదేవీల్లో ఐటీ రంగం వాటా తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2016లో మొత్తం క్రయవిక్రయాలు జరిగిన కార్యాలయ స్థలాల్లో ఐటీ రంగం వాటా 49 శాతం కాగా... 2017లో ఇది 32 శాతానికి పడిపోయినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ తెలియజేసింది.

 ‘భారతదేశం: కార్యాలయాల స్థల లావాదేవీలు’ పేరిట కంపెనీ విడుదల చేసిన నివేదికలో పలు కీలకాంశాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... 2016లో 2 శాతంగా ఉన్న కో–వర్కింగ్‌ స్పేస్‌ (బిజినెస్‌ సెంటర్స్‌) రంగం అనూహ్యంగా 2017లో 6 శాతానికి పెరిగింది. 2017లో ఈ రంగం మొత్తం 2.6 మిలియన్‌ చ.అ. స్థలాన్ని ఆక్రమించింది. బీఎఫ్‌ఎస్‌ఐ రంగం 13 శాతం నుంచి 19 శాతానికి, ఇంజనీరింగ్‌ అండ్‌ తయారీ రంగం 14 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది.

కొత్త ఆఫీస్‌ స్పేస్‌ 18 శాతం డౌన్‌..
దేశంలో ఆఫీసు స్థలాల లావాదేవీలు వరుసగా మూడో ఏడాది 40 మిలియన్‌ చ.అ.లను దాటాయి. 2017లో మొత్తం 42 మిలియన్ల చ.అ. లావాదేవీలు జరగ్గా.. ఇందులో 50 శాతం వాటాను బెంగళూరు, ఢిల్లీ– ఎన్‌సీఆర్‌ నగరాలే ఆక్రమించేశాయి. అయితే కొత్త కార్యాలయాల సప్లయి మాత్రం 2016తో పోలిస్తే 18 శాతం తగ్గి 29 మిలియన్‌ చ.అ.లకు చేరింది. 2017లో జరిగిన మొత్తం లావాదేవీల్లో 50 వేల చ.అ.ల కంటే తక్కువ లావాదేవీలే 90 శాతం వాటాను ఆక్రమించాయి.

Advertisement
 
Advertisement
Advertisement