
సాక్షి, న్యూఢిల్లీ : బినామీ లావాదేవీలకు దూరంగా ఉండాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రజలను హెచ్చరించింది. నూతన బినామీ చట్టం ప్రకారం ఉల్లంఘనలకు క్రిమినల్ ప్రాసిక్యూషన్తో పాటు ఏడేళ్ల వరకూ జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. బినామీ లావాదేవీలకు దూరంగా ఉండాలంటూ ఐటీ శాఖ జాతీయ దినపత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. బినామీదారు, లబ్ధిదారుడుతో పాటు దీనికి సంబంధం ఉన్నవారంతా బినామీ చట్టం ఉల్లంఘనల కింద కఠిన శిక్షను ఎదుర్కొంటారని, అంతేకాకుండా మార్కెట్ విలువలో 25 శాతం జరిమానాగా చెల్లించాలని ఈ ప్రకటనలో ఐటీ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.
ఇక 2016 నవంబర్ 1 నుంచి అక్టోబర్ 2017 వరకూ దేశవ్యాప్తంగా పన్ను అధికారులు రూ 1833 కోట్ల విలువైన బినామీ ఆస్తులను అటాచ్ చేసి 517 నోటీసులు జారీ చేశారు. 2016 నవంబర్ 1 నుంచి నూతన బినామీ లావాదేవీల నియంత్రణ చట్టం కింద చర్యలు తీసుకోవడాన్ని ఐటీ అధికారులు ప్రారంభించారు.