
గ్రీస్, ద్రవ్యోల్బణం ఆధారంగా ట్రెండ్
ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్ను గ్రీస్ పరిణామాలు, ద్రవ్యోల్బణం డేటా, కార్పొరేట్ ఫలితాలు నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు...
ఈ వారం మార్కెట్పై నిపుణుల అంచనా
న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్ను గ్రీస్ పరిణామాలు, ద్రవ్యోల్బణం డేటా, కార్పొరేట్ ఫలితాలు నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అలాగే రుతుపవనాల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు కూడా ట్రెండ్కు కీలకమేనని వారన్నారు.
బెయిలవుట్ ప్యాకేజీ కోసం గ్రీస్ సమర్పించిన కొత్త ప్రతిపాదనలపై యూరోదేశాలు తీసుకోబోయే నిర్ణయం ఈ వారం మార్కెట్కు తొలుత కీలకాంశమని విశ్లేషకులు చెప్పారు. గ్రీస్, యూరోజోన్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావం మార్కెట్లో వుందని, ఈ ఒప్పందం కుదరకపోతే స్వల్పకాలికంగా మార్కెట్లు క్షీణించవచ్చని వారు అంచనాల్లో పేర్కొన్నారు.
అటుతర్వాత ద్రవ్యోల్బణం డేటావైపు మార్కెట్ దృష్టిసారిస్తుందని వారన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు జూలై 13న, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు జూలై 14న వెలువడతాయని, ఈ డేటా మార్కెట్ కదులుతుందని క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. ఈ వారం సిమెంటు కంపెనీ ఏసీసీ, టెక్ కంపెనీ మైండ్ట్రీలు ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఫలితాల సీజన్ అయినందున, ఆయా కంపెనీలు వెల్లడించే ఫలితాల ఆధారంగా ఆయా షేర్ల కదలికలు వుంటాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోది అన్నారు. నిఫ్టీ 8,200-8,500 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ అంచనా వే శారు.
గతవారం మార్కెట్
వరుసగా మూడువారాలపాటు లాభాలు తెచ్చుకున్న స్టాక్ మార్కెట్ గతవారం క్షీణించింది. గ్రీస్, చైనా పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 431 పాయింట్లు నష్టపోయి 27,661 పాయింట్ల వద్ద ముగిసింది.