ద్రవ్యలోటు భయాలు | Sakshi
Sakshi News home page

ద్రవ్యలోటు భయాలు

Published Sat, Dec 1 2018 5:36 AM

Government breaches full-year fiscal deficit target at October-end - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యలోటు భయాలు నెలకొన్నాయి. 2018–19 సంవత్సరంలో ద్రవ్యలోటు ఎంత ఉండాలని కేంద్ర బడ్జెట్‌ నిర్దేశించుకుందో, ఆ స్థాయిని ఇప్పటికే దాటిపోవడం దీని నేపథ్యం. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలు మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. 2018–19లో (ఏప్రిల్‌–మార్చి) ద్రవ్యలోటు రూ.6.24 లక్షల కోట్లుగా ఉండాని కేంద్ర బడ్జెట్‌ నిర్దేశించింది. అయితే ఇది అక్టోబర్‌ నాటికే నాటికే 6.48 లక్షల కోట్లకు పెరిగిపోయింది. అంటే బడ్జెట్‌ అంచనాల్లో 103.9 శాతం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ లోటు బడ్జెట్‌ లక్ష్యంకన్నా దిగువగానే 96.1 శాతంగా ఉంది. కేంద్రానికి ఆదాయాలు తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు లక్ష కోట్ల వస్తు, సేవల పన్ను  (జీఎస్‌టీ) వసూళ్లు జరగాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే ఒక్క ఏప్రిల్, అక్టోబర్‌ మినహా ఏ నెలలోనూ లక్ష కోట్లు వసూలు కాలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే, వృద్ధికి సంబంధించి ప్రభుత్వ వ్యయాలు తగిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.   

లక్ష్య సాధనపై కేంద్రం విశ్వాసం... 
అయితే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించగలమన్న విశ్వాసాన్ని కేంద్రం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు 3.3 శాతానికి మించకూడదన్న లక్ష్యం ఉంది. అయితే ఈ లక్ష్యాన్ని మించవచ్చన్న ఆందోళనలు ఉన్నాయి. గత ఏడాది జీడీపీలో ద్రవ్యలోటు 3.53 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ రెవెన్యూ లక్ష్యం రూ.17.25 లక్షల కోట్లు. అయితే అక్టోబర్‌ వరకూ రూ.7.88 లక్షల కోట్ల రెవెన్యూ వసూళ్లు జరిగాయి. బడ్జెట్‌ లక్ష్యంలో ఇది 45.7 శాతం. వ్యయాలు రూ.14.56 లక్షల కోట్లుగా ఉంది. ఇది బడ్జెట్‌ లక్ష్యంలో 59.6 శాతం. 

Advertisement
Advertisement