జీఎంఆర్‌కు భారీ నష్టాలు

GMR Infra suffers Rs 2,341-crore loss in Q4 - Sakshi

రూ.2,341 కోట్ల నష్టం ప్రకటన

విద్యుత్‌ ఆస్తుల విలువ క్షీణించటం వల్లే

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: విద్యుత్, మౌలికరంగం, విమానయానం వంటి వివిధ రంగాల్లో ఉన్న జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ 2018–19 4వ త్రైమాసికంలో భారీ నష్టాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం ఏకంగా రూ.2,341 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కొన్ని విద్యుత్‌ ఆస్తుల విలువ క్షీణించడం వల్ల ఈ స్థాయి నష్టాలను ఎదుర్కొన్నట్టు కంపెనీ తెలియజేసింది. జీఎంఆర్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (జీసీఈఎల్‌), దీని సబ్సిడరీలు, జాయింట్‌ వెంచర్‌లలో కంపెనీ పెట్టుబడుల విలువ క్షీణించడం వల్ల రూ.1,242 కోట్ల మేర నష్టాలు వచ్చినట్టు వెల్లడించింది.

జీఎంఆర్‌ ఛత్తీస్‌గఢ్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు సంబంధించి రూ.969 కోట్ల నష్టం కూడా తోడైంది. దీంతో మొత్తం పెట్టుబడుల విలువ క్షీణత రూపంలో రూ.2,212 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.5 కోట్ల లాభం రావడం గమనార్హం. ఇక మార్చి క్వార్టర్‌కు మొత్తం ఆదాయం రూ.2,293 కోట్లుగా నమోదయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.2,234 కోట్లుగా ఉంది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ విభాగం మాత్రం రూ.1,357 కోట్ల ఆదాయంపై రూ.271 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికుల ట్రాఫిక్‌ 2018–19లో 5 శాతం పెరిగి 69.2 మిలియన్లుగా ఉంది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికుల ట్రాఫిక్‌ 16 శాతం పెరిగి 21.4 మిలియన్లుగా నమోదైంది.

ఇంధన విభాగంలో తాజా పెట్టుబడుల్లేవు
‘‘ఇంధన విభాగంలో మా వాటాదారుల పెట్టుబడి విలువ గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతమున్న ఇంధన ఆస్తుల సమర్థతను పెంచేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రారంభ పెట్టుబడిని మాఫీ చేశాం. నియంత్రణ పరిస్థితులు మరింత స్పష్టంగా మారి, మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకూ ఈ దశలో ఇంధన విభాగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టబోవడం లేదు. సరైన సమయంలో పెట్టుబడులపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది’’అని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సురేష్‌ చావ్లా తెలిపారు.

ఇటీవల టాటా గ్రూపు, జీఐసీ సింగపూర్, ఎస్‌ఎస్‌జీ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌తో రూ.8,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి చేసుకున్న ఒప్పందంతో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా రుణభారం గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ఎయిర్‌పోర్ట్‌ వ్యాపారం డీమెర్జింగ్‌కు మార్గం సుగమం అవుతుందని జీఎంఆర్‌ గ్రూపు సీఎఫ్‌వో సురేష్‌ బాగ్రోడియా చెప్పారు.  రుణభారం ప్రస్తుత రూ.24,000 కోట్ల నుంచి ఆరోగ్యకరమైన స్థితికి తగ్గిపోతుందన్నారు. విమానాశ్రయాల్లో సామర్థ్యం పరంగా ఇబ్బందులు ఎదురవుతుండడంతో విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top