
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ ఇరకాటంలో కూరుకుపోయారు. రూ.9.96 కోట్లకు తనను మోసం చేశారంటూ వ్యవస్థాపకులు, ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్లపై ఓ వ్యాపారవేత్త ఆరోపణలు గుప్పించాడు. ఈ-కామర్స్ కంపెనీ వ్యవస్థాపకులు, సేల్స్ డైరెక్టర్ హరి, అకౌంట్స్ మేనేజర్స్ సమిత్ ఆనంద్, శారార్కేలపై కేసు నమోదైంది. సీ-స్టోర్ కంపెనీ ఆధారిత ఇందిరానగర్ యజమాని నవీన్ కుమార్ వీరిపై ఫిర్యాదు చేశాడు. 12,500 ల్యాప్టాప్లకు సంబంధించి రూ.9.96 కోట్ల బకాయిలను చెల్లించకుండా తనను మోసం చేశారంటూ అతను ఆరోపించాడు. ల్యాప్టాప్లను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సరఫరా చేసేందుకు ఫ్లిప్కార్ట్తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు.
2015 జూన్ నుంచి 2016 జూన్ వరకు 14వేల ల్యాప్టాప్లను ఇతను కంపెనీకి సరఫరా చేశాడు. 1,482 యూనిట్లను ఫ్లిప్కార్ట్ రిటర్న్ చేసిందని, కానీ మిగతా యూనిట్లకు చెల్లింపులు చేయలేదని నవీన్ ఆరోపించాడు. వీటికి సంబంధించి టీడీఎస్, షిప్పింగ్ ఛార్జీలను చెల్లించలేదన్నాడు. బకాయిలను చెల్లించాలను అడిగితే, ఫ్లిప్కార్ట్ మరో 3,901 యూనిట్లను రిటర్న్ చేసిందని, కానీ బకాయిలను చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐపీసీ సెక్షన్స్ 34, 406, 420 కింద వారిపై కేసు నమోదైంది. ఇందిరానగర్ పోలీసులు దీనిపై విచారణ చేపడుతున్నారు.