జేపీ ఇన్‌ఫ్రాకు ప్రమోటర్ల ఆఫర్‌ రూ.10,000 కోట్లు | Financing of lending and planning of projects | Sakshi
Sakshi News home page

జేపీ ఇన్‌ఫ్రాకు ప్రమోటర్ల ఆఫర్‌ రూ.10,000 కోట్లు

May 8 2018 12:11 AM | Updated on Oct 2 2018 4:31 PM

Financing of lending and planning of projects - Sakshi

న్యూఢిల్లీ: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీని దివాలా స్థితి నుంచి బయటపడేసేందుకు ప్రమోటర్‌ మనోజ్‌ గౌర్‌ రూ.10,000 కోట్లతో బ్యాంకు రుణాలు తీర్చివేయడంతోపాటు, నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేయటానికి ముందుకొచ్చారు. రూ.9,800 కోట్ల రుణాల్లో కొంత తీర్చివేయడం, రుణాలిచ్చిన సంస్థలకు ఈక్విటీ వాటా కేటాయించడంతోపాటు అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రణాళికలో భాగం. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ ముందు గౌర్‌ ఈ ప్రణాళికను ఉంచారు. గ్రూపు కంపెనీని కాపాడుకునేందుకు హైడ్రో ఎలక్ట్రిక్, సిమెంట్‌ ప్రాజెక్టుల్లో మనోజ్‌గౌర్‌ తనకున్న వాటాలను ఇప్పటికే విక్రయించిన విషయం తెలిసిందే.

అయితే, గౌర్‌ తాజా ప్రణాళికకు రుణదాతల కమిటీ అంగీకరించినదీ, లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. జేపీ ఇన్‌ఫ్రా కొనుగోలుకు లక్షద్వీప్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఇటీవలే రూ.7,350 కోట్లతో బిడ్‌ వేసింది. దీంతో పోలిస్తే మనోజ్‌గౌర్‌ ఎక్కువ ఆఫర్‌తో ముందుకొచ్చినట్టే. కాగా, దీనిపై రానున్న రెండు రోజుల్లో రుణదాతల కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ 32,000 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికి కేవలం 9,500 మాత్రమే పూర్తి చేసి స్వాధీనం చేసింది. మరో 4,500 ఫ్లాట్ల నిర్మాణం పూర్తయింది. మిగిలినవి కూడా పూర్తి చేయాలంటే రూ.6,500 కోట్లు కావాల్సి ఉంటుంది.  

Advertisement
 
Advertisement
Advertisement