మెరుగైన రవాణాతోనే ఆర్థిక వృద్ధి

Economic growth is better with better transportation - Sakshi

ఎలక్ట్రిక్‌ వాహన తయారీపై పెట్టుబడులు పెట్టండి

పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించాలి

అందుకు శుద్ధ ఇంధన ఆధారిత వాహనాలే పరిష్కారం

ఐదేళ్లలో ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు 15 శాతానికి

ప్రజారవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ: మెరుగైన రవాణాతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, బ్యాటరీలు, స్మార్ట్‌ చార్జింగ్‌ సదుపాయాలు సహా ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి అన్ని విభాగాల్లో (చైన్‌) పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. పర్యావరణంపై పోరుకు శుద్ధ ఇంధన ఆధారిత రవాణా మన చేతుల్లో ఉన్న శక్తిమంతమైన ఆయుధంగా పేర్కొన్నారు. కార్లపైనే కాకుండా స్కూటర్లు, ఆటో రిక్షాల తయారీపైనా దృష్టి సారించాలన్నారు. ఢిల్లీలో శుక్రవారం గ్లోబల్‌ మొబిలిటీ సమ్మిట్‌ (ప్రపంచ రవాణా సదస్సు) ‘మూవ్‌’ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆటోమొబైల్‌ సంస్థల సీఈవోలు, పలు దేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. రద్దీ కారణంగా పర్యావరణంపై పడే ప్రభావాన్ని నిరోధించేందుకు రద్దీ రహిత రవాణా కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘‘మెరుగైన రవాణా సదుపాయాల వల్ల ప్రయాణ, రవాణా వ్యయాలు తగ్గుతాయి. ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఇప్పటికే ఎక్కువ ఉద్యోగాలను ఇస్తున్న రవాణా రంగం, తదుపరి తరం ఉద్యోగాలను కూడా సృష్టించగలదు. కాలుష్య ఉద్గారాల నియంత్రణకు, శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు, వచ్చే ఐదేళ్లలో మొత్తం వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా 15 శాతం ఉండాలనే లక్ష్యాన్ని విధించుకున్నాం’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. 

ప్రజా రవాణాతో రద్దీకి చెక్‌ 
భారత్‌లో భవిష్యత్తు రవాణాపై తన విజన్‌... సాధారణ, అనుసంధాన, సౌకర్యవంతమైన, రద్దీ రహిత, శుద్ధ ఇంధన తదితర ఏడు ‘సీ’ల (కామన్, కనెక్టెడ్, కన్వీనియెంట్, కంజెషన్‌ ఫ్రీ, చార్జ్‌డ్, క్లీన్, కటింగ్‌ ఎడ్జ్‌) ఆధారంగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. వ్యక్తిగత వాహనాలకు బదులు ప్రజారవాణాను వినియోగించుకోవడం వల్ల ట్రాఫిక్‌ జామ్‌లు తగ్గి, ప్రయాణించే వారిపై ఒత్తిడి తగ్గుతుందని సూచించారు. బ్యాటరీ టెక్నాలజీ ఆవిష్కరణల పట్ల భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, తయారీదారులు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని చెప్పారు. తమ హయాంలో హైవేల నిర్మాణాన్ని రెట్టింపు చేశామని, గ్రామీణ రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని తిరిగి పునరుజ్జీవింప చేశామని, శుద్ధ ఇంధన ఆధారిత వాహనాలకు ప్రోత్సాహం తదితర చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని వివరించారు.     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top