
జీఎస్టీ ప్రయోజనాలు కస్టమర్లకు అందాలి
టెలికం కంపెనీలు జీఎస్టీ ఫలాలను వినియోగదారులకు అందించాలని ఆర్థిక శాఖ సూచించింది.
టెల్కోలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు జీఎస్టీ ఫలాలను వినియోగదారులకు అందించాలని ఆర్థిక శాఖ సూచించింది. వ్యయాలు తగ్గే అవకాశం వున్నందున, ఆ ప్రయోజనాలను జూలై నుంచి కస్టమర్లకు బదిలీ చేసేందుకు టారిఫ్లను తగ్గించాలని కోరింది. ప్రస్తుతం టెలికం సర్వీసులపై 14 శాతం సర్వీస్ ట్యాక్స్ సహా స్వచ్ఛ్ భారత్ సెస్, కృషి కల్యాణ్ సెస్ కలిపి 1 శాతం వరకూ ఉన్నాయి. ‘టెలికమ్యూనికేషన్ సర్వీసెస్పై 18 శాతం జీఎస్టీని నిర్దేశించారు. ఇది పూర్తిగా వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్. అయితే ఇకనుంచి సర్వీస్ ప్రొవైడర్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను (ఐటీసీ) పొందొచ్చు. దీంతో మొత్తంగా రేటు తగ్గనుంది’ అని ఆర్థిక శాఖ పేర్కొంది.
ప్రస్తుతం టెలికం సర్వీస్ ప్రొవైడర్లు వారు కొనుగోలు చేసే పరికరాలపై చెల్లించిన వ్యాట్ను క్రెడిట్ చేసుకోవడానికి, దిగుమతి చేసుకున్న ప్రొడక్టులపై చెల్లించిన స్పెషల్ అడిషనల్ డ్యూటీని క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. అయితే జీఎస్టీ కింద సర్వీస్ ప్రొవైడర్లు దేశీ వస్తువులు, దిగుమతి చేసుకున్న ప్రొడక్టులపై చెల్లించిన ఐజీఎస్టీని క్రెడిట్ చేసుకోవచ్చు. టెలికం పరికరాలు, తదితర ఇన్ఫ్రా పెట్టుబడులకయ్యే వ్యయాన్ని ఐటీసీ ద్వారా చూపించి పొందే పన్ను ప్రయోజనం 2 శాతం వరకూ వుంటుంది. అలాగే స్పెక్ట్రం కేటాయింపు కోసం ప్రభుత్వానికి చెల్లించే సర్వీస్ట్యాక్స్పై నుంచి కూడా ఐటీసీని పొందవచ్చు. 2016 స్పెక్ట్రం కేటాయింపులపై చెల్లించిన సర్వీస్ ట్యాక్స్ ఐటీసీని టెల్కోలు మూడేళ్ల వ్యవధిలో పొందే అవకాశముంది. ఈ రెండు ఐటీసీ ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకుంటే టెలికం కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం చెల్లించిన మొత్తంలో జీఎస్టీ కింద 87 శాతం చెల్లిస్తే సరిపోతుంది.