‘రిచ్‌ ట్యాక్స్‌’ వచ్చేస్తోంది.... | Congress Will Impose 5% Cess On super Rich | Sakshi
Sakshi News home page

అత్యంత ధనవంతులపై 5 శాతం సెస్‌

Mar 19 2018 8:12 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Will Impose 5% Cess On super Rich - Sakshi

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ తమ మేనిఫెస్ట్‌లతో సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని కొల్లగొట్టాలని కాంగ్రెస్‌ తీవ్ర వ్యూహారచన చేస్తోంది. దీనిలో భాగంగానే పేద ప్రజలను ఆకట్టుకోవడానికి అత్యంత ధనవంతులపై 5 శాతం సెస్‌ను విధించనున్నట్టు వెల్లడించింది. ‘రిచ్‌ ట్యాక్స్‌’ పేరుతో ఈ సెస్‌ను విధించబోతోంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ 84వ ప్లీనరీలో ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ‘జాతీయ దారిద్య్ర నిర్మూలన ఫండ్‌’  ను తాము ఏర్పాటుచేయనున్నామని, తాము అధికారంలోకి వచ్చాక 1 శాతం అత్యంత ధనవంతులపై 5 శాతం సెస్‌ను విధించనున్నామని పేర్కొంది. ఈ ఫండ్‌ను షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు, ఇతర దారిద్య్ర దిగువనున్న కుటుంబాలకు విద్యా స్కాలర్‌షిప్‌లను అందించనున్నామని తెలిపింది.

పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ ఓ రెజుల్యూషన్‌ను తమ ప్లీనరీలో ప్రవేశపెట్టారు.దేశంలో పేరుకుపోయిన అసమానతలను గుర్తించాల్సినవసరం ఉందని కాంగ్రెస్‌ పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తగ్గుతున్న సామాజిక సంక్షేమ పథకాల ప్రాముఖ్యంపై విమర్శలు గుప్పించింది. పెరుగుతున్న ఆదాయ అసమానతలపై కాంగ్రెస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ అని బీజేపీ వాగ్ధానం చేసిందని, కానీ దానికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తుందని కాంగ్రెస్‌ విమర్శించింది. బీజేపీ పాలనలో 1 శాతం ధనికుల సంపద 73 శాతం పెరిగిందని, కిందనున్న జనాభా సంపద కేవలం 1 శాతం మాత్రమే పెరిగినట్టు తెలిపింది.  ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న డిమానిటైజేషన్ ప్రక్రియతో, ప్రజలు తమ వద్దనున్న నోట్లను మార్చుకోలేక, గంటల పాటు క్యూలైన్లో నిల్చోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొంది. పెద్ద నోట్లను మార్చుకోవడానికి క్యూలైన్‌లో నిల్చుని 100కి పైగా ప్రజలు మరణించారని ఆందోళన వ్యక్తం చేసింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement