పోలింగ్కు అంతా రెడీ
● పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం ● ఇంటింటికీ ఓటరు స్లిప్పుల పంపిణీ ● ప్రతీ పోలింగ్ బూత్లో రెండు బ్యాలెట్ యూనిట్లు ● ముగిసిన ప్రచార పర్వం, 144 సెక్షన్ అమలు ● సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు ● నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి ● మీడియా సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ మహంతిసాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్క్రైం:
పార్లమెంటు ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి వెల్లడించారు. పోలింగ్ స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సర్వం సిద్ధం చేశామని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా సత్ప తి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతితో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,194 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపా రు. 17లక్షల 97వేల మంది ఓటర్లు ఉన్నారని, పురుషుల కన్నా మహిళలు 40,000మంది అధికంగా ఉన్నారని వివరించారు. 42వేల మంది ది వ్యాంగులు ఉన్నారని, వయోవృద్ధులు 13200 మంది ఉన్నారని, వీరికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు 10,200 మంది ఉండగా, ఇందులో 8,815 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ) కింద నమోదు చేసుకున్న 6,800 మంది పోలింగ్ రోజున ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, నోటాతో కలుపుకొని ఒకటి అదనంగా ఉంటుందని, ఈ మేరకు ఒక్కో పోలింగ్స్టేషన్లో రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా 21 ఎఫ్ఎస్టీ, 14 ఎస్ఎస్టీ టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 215 రూట్లలో 216 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించామని, ఈవీఎంలను తీసుకెళ్లే వెహికల్స్కు జీపీఎస్ అనుసంధానం ఉంటుందని తెలిపారు. కోడ్ ఉల్లంఘనపై 16 కేసులు నమోదు చేశామని వివరించారు. దాదాపు రూ.8 కోట్ల 87లక్షల నగదును, రూ.2 కోట్ల 11 లక్షల మద్యం, రూ.4కోట్ల 87 లక్షల గంజాయిని సీజ్ చేశామని పేర్కొన్నారు. ఇంటింటికీ ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశామని, దాదాపు 97 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. శనివారం సాయంత్రం నుంచి ఐదుగురికి మించకుండా ఇంటింటికి ప్రచారం చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. 13న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటుహక్కు ఓటుహక్కు వినియోగించుకోవచ్చన్నారు. 288 సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్, చొప్పదండి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉంటుందని, మానకొండూరుకు సంబంధించి కరీంనగర్లోని పాలిటెక్నిక్లో ఉంటుందని తెలిపారు.
భారీ బందోబస్తు: సీపీ మహంతి
అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి పేర్కొన్నారు. 2,500మంది పోలీసులను వినియోగిస్తున్నామని చెప్పారు. 54 స్పెషల్ క్రిటికల్ పోలింగ్స్టేషన్లకు పారా మిలటరీ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. 1,106 పోలింగ్ స్టేషన్లల్లో 106 రూట్లలో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్రూంకు చేరేవరకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.మూడో ర్యాండమైజేషన్ పూర్తి
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ కలెక్టరేట్లో పోలింగ్ అధికారుల మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ అమిత్ కటారియా పర్యవేక్షించారు. ఎన్నికల అధికారి పమేలా సత్పతి మాట్లాడుతూ కరీంనగర్కు 395 పోలింగ్ స్టేషన్లకు 1,804 మంది, చొప్పదండికి 327 పోలింగ్ స్టేషన్లకు 1,528 మంది, మానకొండూర్కు 316 పోలింగ్ స్టేషన్లకు 1,472 మంది, హుజూరాబాద్లో 305 పోలింగ్ స్టేషన్లకు 1,404 మంది పీఓలు, ఏపీవోలు, ఓపీవోలను అలాట్ చేశామని తెలిపారు. సిరిసిల్లకు 287 పోలింగ్ స్టేషన్లకు 1,376 మంది, వేములవాడకు 260 పోలింగ్ స్టేషన్లకు 1,232 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు వివరించారు.