రెండు మూడు అంశాల్లో ఆర్‌బీఐతో విభేదాలు | Arun Jaitley admits to 2-3 areas of differences between Centre, RBI | Sakshi
Sakshi News home page

రెండు మూడు అంశాల్లో ఆర్‌బీఐతో విభేదాలు

Dec 14 2018 4:03 AM | Updated on Dec 14 2018 4:03 AM

Arun Jaitley admits to 2-3 areas of differences between Centre, RBI - Sakshi

ముంబై: రెండు మూడు విషయాల్లో ఆర్‌బీఐతో ప్రభుత్వానికి అంతరాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అంగీకరించారు. ఆర్‌బీఐ పనితీరుపై చర్చను దెబ్బతీయడంగా ఎలా అభివర్ణిస్తారని జైట్లీ ప్రశ్నించారు. రాజకీయ పరమైన ఒత్తిళ్ల కారణంగానే ఉర్జిత్‌ పటేల్‌ ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో... గతంలోనూ ప్రభుత్వాలు ఈ తరహా చర్యలు తీసుకున్న ఉదంతాలున్నాయన్నారు. కాంగ్రెస్‌ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ ఆర్‌బీఐ గవర్నర్లను రాజీనామా చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు.

ముంబైలో టైమ్స్‌ నెట్‌వర్క్‌ నిర్వహించిన భారత ఆర్థిక సదస్సుకు హాజరైన సందర్భంగా జైట్లీ మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలో రుణాల లభ్యత, ద్రవ్యపరమైన మద్దతు విషయాల్లో ఆర్‌బీఐతో విభేదాలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. ప్రభుత్వం తన ఆందోళనలను తెలియజేసేందుకు చర్చలను ప్రారంభించినట్టు తెలిపారు. ఓ కీలకమైన సంస్థగా ఆర్‌బీఐతో చర్చలు జరపడం దెబ్బతీయడం అవుతుందా? అని ప్రశ్నించారు. ‘‘మాది సౌర్వభౌమ ప్రభుత్వం. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విషయంలో చాలా ముఖ్యమైన భాగస్వాములం’’ అని జైట్లీ అభివర్ణించారు. రుణాలు, లిక్విడిటీ విషయంలో ఆర్‌బీఐపై బాధ్యత ఉందన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement