
మరో వివాదంలో ఫోక్స్వ్యాగన్
దాదాపు కోటికిపైగా డీజల్ కార్లకు సంబంధించిన ఉద్గార పరీక్షల ఫలితాల్లో అవకతవకలను పాల్పడిందనే వివాదం సమసిపోకముందే జర్మనీ ఆటో దిగ్గజం ఫోక్స్వ్యాగన్ మరో వివాదంలో చిక్కుకుంది.
కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గార పరీక్షల్లో అవకతవకలు జరిగనట్లు ఆరోపణ
బెర్లిన్: దాదాపు కోటికిపైగా డీజల్ కార్లకు సంబంధించిన ఉద్గార పరీక్షల ఫలితాల్లో అవకతవకలను పాల్పడిందనే వివాదం సమసిపోకముందే జర్మనీ ఆటో దిగ్గజం ఫోక్స్వ్యాగన్ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఫోక్స్వ్యాగన్ కంపెనీ యూరప్లోని తన 98,000 పెట్రోల్ కార్లకు సంబంధించి కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గార పరీక్షల్లో కూడా అవకతవకలను పాల్పడిందనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి.
దీంతో జర్మనీ ప్రభుత్వం ఫోక్స్వ్యాగన్పై దర్యాప్తుకు ఆదేశించింది. ఉద్గారాల వివాదంలోకి పెట్రోల్ కార్లు చేరడం ఇదే తొలిసారి. తాజా ఆరోపణల నేపథ్యంలో గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గార పరీక్ష ఫలితాలపై దర్యాప్తు నిర్వహించాలని ఫెడరల్ ఆఫీస్ను కోరింది. జర్మనీ ప్రభుత్వం ఫోక్స్వ్యాగన్ కంపెనీపై అధిక పన్నులను విధించే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ తన పన్నుల ప్రభావాన్ని వినియోగదారులపై మోపకుండా చూసేలా జర్మనీ ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించే పనిలో ఉంది.