200 కోట్ల వసూళ్లు సాధించిన హౌస్‌ఫుల్‌ 4

Housefull 4 Crosses Rs 200 Crores - Sakshi

సాక్షి, ముంబై : కిలాడీ అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం హౌస్‌ఫుల్‌ 4 కలెక్షన్లలో దూసుకుపోతోంది. అక్టోబర్‌ 25న విడుదలైన ఈ చిత్రంపై మొదట్లో మిశ్రమ స్పందన వచ్చినా అనంతరం పుంజుకొని ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా రూ. 200.58 కోట్లను వసూలు చేసిందని చిత్ర నిర్మాత సాజిద్‌ నడియావాలా మంగళవారం ప్రకటించారు. అనంతరం చిత్రం విజయం పట్ల చిత్రంలోని నటులు కృతిసనన్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్మాణ బృందానికి అభినందనలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

అక్షయ్‌ గత చిత్రం మిషన్‌ మంగళ రూ. 202 కోట్లు వసూలు చేసింది. త్వరలో ఈ రికార్డును తాజా చిత్రం అధిగమించే అవకాశముంది. మరోవైపు ఈ సినిమా వసూళ్లతో అక్షయ్‌కుమార్‌ 2019 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ హీరోగా నిలిచాడు. ఈ ఏడాది అక్షయ్‌ కుమార్‌ సినిమాలు సాధించిన వసూళ్లు రూ. 542 కోట్లుగా ఉన్నాయి. రెండో స్థానంలో హృతిక్‌ రోషన్‌ నిలిచాడు. ఆయన నటించిన సూపర్‌ 30, వార్‌ సినిమాలు రూ. 463 కోట్ల వసూళ్లు సాధించాయి. 

ఇదిలా ఉండగా, ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని వచ్చిన విమర్శలపై అక్షయ్‌కుమార్‌ తొలిసారి స్పందించారు. ‘హౌస్‌ఫుల్‌ 4 చిత్ర నిర్మాణంలో లాస్‌ ఏంజెల్స్‌లో ఉన్న ప్రముఖ హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్‌కాన్‌ కూడా పాలుపంచుకుంది. వారు మిలియన్ల కొద్దీ డబ్బు ఖర్చుపెట్టి ప్రతీ ఏటా సినిమాలు నిర్మిస్తారు. ఎంతో పేరున్న ఫాక్స్‌కాన్‌ సంస్థే తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఈ సినిమా వసూళ్లను పేర్కొంది. ఫేక్‌ కలెక్షన్లు అంటూ వాగే వారికి ఇదే నా సమాధాన’మంటూ ఘాటుగా బదులిచ్చాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top