టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.. | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు..

Published Wed, Dec 20 2017 2:01 PM

ysrcp demands action against tdp leaders on visakha issue - Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు మొదటి నుంచి దళిత వ్యతిరేకేనని ఆయన మండిపడ్డారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం ఘటనను మేరుగ నాగార్జున తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ నేతలు, కార్యకర్తలు దళితులపై ఎటువంటి ఘాతుకాలకు పాల్పడినా ప్రభుత్వం చర్యలు తీసుకోదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ దారుణ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కాగా విశాఖ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాక్షసంగా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి తెర తీశారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూమిని ‘ఎన్టీఆర్‌ గృహకల్ప’ పేరుతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకోవడమే ఆ మహిళ చేసిన తప్పు. తమ కబ్జాకాండను అడ్డుకున్నారన్న నెపంతో మహిళ అని చూడకుండా దుస్తులు చింపేసి ఈడ్చేశారు. బండ బూతులు తిడుతూ ఇతర దళితులను వెంటాడి కొట్టారు. ఈ ఘటనపై మంగళవారం బాధితులు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


 

Advertisement
Advertisement