అన్నదాతకు ఆసరా.. వైఎస్సార్‌ రైతు భరోసా

YSR Raitu Barrosa For Farmers - Sakshi

జగనన్న సీఎం అయితే రైతన్నకు ఏటా రూ.12500 అందజేత

ఇప్పటి వరకు సాగుకు అప్పులు తెచ్చుకుంటున్న రైతులు 

జగనన్న ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

పొలం సాగు చేయాలంటే పుస్తెలు తాకట్టుపెట్టాల్సిన దుస్థితి.  సాగు పెట్టుబడులకు బ్యాంకులు రుణాలివ్వక, బయట మార్కెట్‌లో అప్పులు చిక్కక రైతులు ఏటా భార్యల మెడలోని పుస్తెలు తాకట్టు పెట్టే దీనస్థితి. ఆ ఏడు పంట పండకుంటే తనఖా పెట్టిన ఆ పుస్తెలు వేలానికి వెళ్లే పరిస్థితి. ఇంతటి దీనస్థితిలో ఉన్న రైతులకు ఆసరాగా ఉండేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన వైఎస్సార్‌ భరోసా పథకంపై రైతులు సర్వత్రా హర్షం వ్యకం చేస్తున్నారు. ఈ పథకం తమకు రైతులకు కొండ ధైర్యానిస్తోంది. జగనన్న వస్తేనే తమ జీవితాలు బాగుపడతాయని రైతులు ఎదురుచూస్తున్నారు.

సాక్షి, పొన్నలూరు (ప్రకాశం): నవరత్నాల్లో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన వైఎస్సార్‌ రైతు భరోసా కోట్లాది  రైతన్నలకు ఆసరాగా నిలవనుంది. వర్షాభావ పరిస్థితులు, కరువు, పెట్టుబడి అప్పులు, కష్టాల బాటలో పయనిస్తున్న రైతులకు అండగా నేనున్నానంటూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రైతు భరోసా పథకం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. దీంతో పాటు సీజన్‌లో పంట సాగుకు ముందే గిట్టుబాటు ధర ప్రకటన, ఉచిత విద్యుత్, వ్యవసాయ బోర్లు, వడ్డీలేని రుణాలు, ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధి, శీతల గిడ్డంగుల ఏర్పాటు వంటి పలు ప్రయోజనాలు చేకూరుస్తానని జగన్‌ హామీ ఇవ్వడంతో రైతాంగం ఆయనకు నీరాజనం పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో అన్నదాతలు గత ఐదేళ్లుగా అవస్థలు పడ్డారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటు వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు చంద్రబాబు చెప్పిన విధంగా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతన్నలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రుణమాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం మాటతప్పి కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే రైతుల ఖాతాలకు జమ చేస్తామన్నారు. ఈ నగదు కూడా ఐదు విడతల్లో రైతులకు చెల్లిస్తామని చెప్పారు.

కాని ఇప్పటి వరకు మూడు విడతలు మాత్రమే రుణమాఫీ నగదును అరకొరగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేశారు. నాలుగు, ఐదో విడత రుణమాఫీ సొమ్ము జమకాక పోవడంతో రైతులు నెలల కాలంగా ఎదురుచూశారు. తీరా ఎన్నికలు సమీపిస్తుండటంతో వారి ఆశలు నెరవేరలేదు. ఇటువంటి తరుణంలో జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రభుత్వం ఏర్పడగానే వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు ఎంతో ప్రయోజనం
రైతు భరోసా పథకం వల్ల ప్రతి రైతుకు ప్రయోజనం కలుగుతుంది. సీజన్‌ ప్రారంభంలో ప్రతి ఏటా సాగు ఖర్చులకు రూ.12500 ఇస్తామని చెప్పడం ఆనందదాయకం. దీని వల్ల రైతులు పెట్టుబడి ఖర్చులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం అందించే సొమ్ముతో సాగు పెట్టుబడి లభిస్తుంది.
- శిరిగిరి వెంకటకృష్ణారెడ్డి, సుంకిరెడ్డిపాలెం

వడ్డీ లేని రుణాలు లభిస్తాయి
ప్రస్తుతం రైతులు పంట రుణాలకు వడ్డీ చెల్లిస్తున్నారు. దీంతో పాటు పంటల బీమా కోసం ఇచ్చే రుణంలో కొంత సొమ్ము తీసుకుంటున్నారు. జగన్‌ ప్రకటించిన వైఎస్సార్‌ రైతు భరోసా వల్ల వడ్డీ లేని రుణాలు అందుతాయి. వ్యవసాయ బోర్లకు సైతం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెప్పడం ఆనందంగా ఉంది. పగటి పూట తొమ్మిది గంటలు కరెంట్‌ సరఫరా చేస్తాననడం హర్షణీయం.
- పోకూరి రవణయ్య, రైతు, రావులకొల్లు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top