
జనభేరి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచార భేరికి తొలిరోజు జనం నీరాజనాలు పలికారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచార భేరికి తొలిరోజు జనం నీరాజనాలు పలికారు. ప్రచారంలో భాగంగా నాలుగు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన షర్మిలకు తొలి రోజు సోమవారం ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.
షర్మిల ఆవేశ పూరిత ప్రసంగానికి జేజేలు కొట్టారు. చంద్రబాబును గెలిపిస్తే రాష్ట్రానికి చంద్రగ్రహణం తప్పదన్న షర్మిల మాటలకు జనం ఈలలు, కేకలతో పెద్ద ఎత్తున స్పందించారు. తెలుగు జాతిని నిలువునా చీల్చిన కిరణ్, చంద్రబాబుకు దిమ్మతిరిగేలా వచ్చే ఎన్నికల్లో తీర్చు చెప్పాలన్న షర్మిల మాటలకు ప్రజలు సానుకూలంగా స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామంటూ ప్రజలు షర్మిలకు హామీ ఇచ్చారు.
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి బయల్దేరిన షర్మిల సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన మర్రిపాడుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె పార్టీ శ్రేణు లు, కార్యకర్తల సందోహం మధ్య రోడ్షో ప్రారంభ మైంది. ఈ రోడ్షోలో జనం గ్రామ గ్రామాన ఆమెకు ఘన స్వాగతం పలికారు. షర్మిలను చూసేం దుకు మహిళలు, పిల్లలే కాకుండా పెద్ద ఎత్తున ప్రజలు ఎగబడ్డారు.
అందరినీ పలకరిస్తూ షర్మిల రోడ్షో ఆత్మకూరు వరకు సాగింది. రాత్రి 7 గంటల ప్రాం తంలో ఆత్మకూరు పట్టణంలోని బస్టాం డు సెంటర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు. సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలి వచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువత షర్మిలను చూసేందుకు ఎగబడ్డారు. షర్మిల అర్థవంతమైన ఆవేశపూరిత ప్రసంగం జనాన్ని మరింత ఆకట్టుకుంది. చంద్రబాబు తొమ్మిదేళ్ల దుష్టపాలనను షర్మిల ప్రజల కళ్లముందు పెట్టారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలు ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. ఆ తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనను ఆమె ప్రజలకు వివరించారు.
వైఎస్సార్ పాలనలో విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు మొత్తంగా రాష్ట్ర ప్రజలు ఎంత అభివృద్ధి చెందింది వివరించారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను సంపూర్తిగా అందించినప్పటికీ ఏ ఒక్కరిపై పన్నుల భారం వేయకుండా వైఎస్సార్ పరిపాలించిన తీరును షర్మిల ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇప్పుడు తెలుగు జాతిని ముక్కలు చేసేందుకు చంద్రబాబు, కిరణ్ కుమార్రెడ్డిలే కారణమని, ఇందుకు బీజేపీ సహకరించిందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చిత్తశుద్ధితో పోరాడిందన్న షర్మిల మాటలకు ప్రజలు నిజమే నిజమే అంటూ ఈలలు , కేకలతో ఉత్సాహపరిచారు.
వైఎస్సార్ సువర్ణ పాలన రావాలంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని షర్మిల కోరారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు రాకుండా చేస్తామంటూ జనం షర్మిలను మరింత ఉత్సాహపరిచారు. మున్సిపల్, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేస్తే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పోటీ చేసే పరిస్థితి లేకుండా చేయాలన్న షర్మిల మాటలకు అలాగే చేస్తామంటూ జనం కేకలు, ఈలలతో సమాధానమిచ్చారు.
జగన్ జనం కోసమే ఉన్నాడని, మీ సుఖ సంతోషాల కోసం ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాడంటూ షర్మిల ఉద్వేగ భరితంగా చేసిన ప్రసంగానికి మరింత స్పందన లభించింది. ఆద్యంతం సభకు వచ్చిన ప్రజలు ఉత్సాహంతో స్పందించారు. జగనే మా నాయకుడంటూ నినదించారు. రామరాజ్యం రావాల్సిందేనంటూ ఎలుగెత్తిచాటారు. జిల్లాలో తొలి రోజు షర్మిల ఎన్నికల ప్రచార కార్యక్రమం, రోడ్షో, సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.