చంద్రబాబు సీమకు అన్యాయం చేస్తున్నారు: వైఎస్ జగన్ | ys jagan takes on chandra babu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సీమకు అన్యాయం చేస్తున్నారు: వైఎస్ జగన్

Apr 17 2015 4:21 PM | Updated on Jul 25 2018 4:09 PM

చంద్రబాబు సీమకు అన్యాయం చేస్తున్నారు: వైఎస్ జగన్ - Sakshi

చంద్రబాబు సీమకు అన్యాయం చేస్తున్నారు: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టిసీమ ప్రాజెక్టుపై కంటే డబ్బులపైనే ప్రేమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టిసీమ ప్రాజెక్టుపై కంటే డబ్బులపైనే ప్రేమని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.  ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో  బనకచర్ల డైవర్షన్ స్కీమ్ హెడ్ రెగ్యలరేటర్ పనులను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.

గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గాలేరు నగరి ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పక్కనబెట్టి, పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఇద్దరు మాత్రమే టెండర్లు వేశారని చెప్పారు. చంద్రబాబు లంచాలు తీసుకుని, రైతులకు అన్యాయం చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.




పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు 44 వేల క్యూసెక్కుల నీరు రావాల్సివుండగా, 3 నుంచి 4 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు ఎక్కువ కోట్ చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల చంద్రబాబుకు 300 కోట్ల రూపాయల ముడుపులు అందాయని విమర్శించారు. పట్టిసీమ జీవోలో రాయలసీమ గురించి ప్రస్తావన లేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఈ ప్రభుత్వ తీరుపై గట్టిగా పోరాడుతామని చెప్పారు.

వైఎస్ జగన్ అంతకుముందు శ్రీశైలం కుడి కాలువ పనుల గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. గండికోట రిజర్వాయర్కు 30 టీఎంసీల నీరు ఎలా తెప్పిస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ ఏడాది గండికోటకు ఎన్ని టీఎంసీల నీరు అందించగలిగారని ఇంజీనీర్లను అడిగారు. గండికోటకు 30 టీఎంసీల నీరు చేరుకోవాలంటే మధ్యలో పనులు జరగాల్సివుండగా, ఈ పనులు పూర్తికావాలంటే చాలా ఏళ్లు పడుతుందని వైఎస్ జగన్ అన్నారు.  ఈ ఏడాది గండికోటకు కేవలం ఒక టీఎంసీ నీరు ఇవ్వగలిగామని ఇంజినీర్లు వివరించారు. రాయలసీమ ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులపై వైఎస్ జగన్ ఆరా తీశారు.


వైఎస్ జగన్ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు..

  • ప్రాజెక్టులపై చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారు
  • వెలిగొండ ప్రాజెక్టును గాలికొదిలేశారు
  • శ్రీశైలం జలాశయంలో కనీసం నీటిమట్టం 854 అడుగులు ఉండాలని వైఎస్ హయాంలో నిర్ణయించారు
  • కనీస నీటిమట్టం 854 అడుగులు ఉంటేనే రాయలసీమకు నీరు అందుతుంది
  • చంద్రబాబు వచ్చాక శ్రీశైలం నీటిమట్టాన్ని 803 అడుగులకు తగ్గించారు
  • రాయలసీమపై ప్రేమ ఉందని చెబుతూనే చంద్రబాబు తీరని అన్యాయం చేశారు
  • శ్రీశైలం నిండినా సీమకు మాత్రం నీళ్లు రావడం లేదు
  • బాబు హయాంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరిచ్చింది లేదు
  • హంద్రీనీవాకు 40 టీఎంసీలు ఎందుకు.. 5 టీఎంసీలు చాలని జీవో ఇచ్చిన ఘనత చంద్రబాబుదే
  • రూ. 1100 కోట్లు కేటాయిస్తే హంద్రీనీవా పూర్తవతుంది
  • కానీ బడ్జెట్లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించారు
  • పట్టిసీమ ప్రాజెక్టులో చంద్రబాబు డబ్బులు తింటూ మిగిలిన ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు
  • గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేయడానికి 2600 కోట్లు కావాల్సివుండగా, 169 కోట్లు మాత్రమే కేటాయించారు
  • పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యవసరమైనది

Advertisement
 
Advertisement
Advertisement