వైఎస్‌ జగన్‌కు అభినందనల వెల్లువ

YS Jagan got waves of congratulations From Govt officials and YSRCP winners - Sakshi

పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రభుత్వ ఉన్నతాధికారులు, వైఎస్సార్‌సీపీ విజేతలు 

జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్‌ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు 

సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండో రోజు శుక్రవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులతో నిండిపోయింది. ఉదయం నుంచీ రోజంతా జగన్‌ సందర్శకులను కలుసుకుంటూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు జగన్‌ను కలవడానికి క్యూ కట్టారు. సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని, తమను తాము పరిచయం చేసుకుని అభినందనలు తెలియజేశారు.

జగన్‌ వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పాలనాపరమైన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగన్‌ను కలిసిన ఐఏఎస్‌లలో సతీష్‌చంద్ర, కరికాళ వలవన్, ఎంటీ కృష్ణబాబు, ఆదిత్యనాథ్‌ దాస్, ధనుంజయ్‌రెడ్డి, పీవీ రమేష్‌కుమార్, కె.సునీత, మన్మోహన్‌సింగ్, జేఎస్వీ ప్రసాద్, లక్ష్మీపార్థసారథి, ఎస్‌ఎస్‌ రావత్, అహ్మద్‌ బాబు, సాయిప్రసాద్, సీహెచ్‌ శ్రీధర్, విజయానంద్, అజయ్‌ జైన్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఇతర అధికారులున్నారు. ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేంద్రబాబు, ఐపీఎస్‌లలో గౌతమ్‌ సవాంగ్, అనూరాధ, బాలసుబ్రహ్మణ్యం, మీనా, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావుతో పాటుగా పలువురు అధికారులు జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. 

జగన్‌తో కొడాలి నాని, దాడిశెట్టి రాజా, బాలశౌరి, బొత్స సత్యనారాయణ భేటీ 
​​​​​​​

కిటకిటలాడిన రహదారులు 
ఎన్నికల్లో గెలుపొందిన పలువురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కూడా జగన్‌ను కలుసుకున్నారు. ఎంపీలుగా గెలుపొందిన కనుమూరు రఘురామకృష్ణం రాజు, మార్గాని భరత్, మిథున్‌రెడ్డి, నందిగం సురేష్, వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.శ్రీనివాసులు, మహ్మద్‌ ముస్తాఫా, కె.పార్థసారథి, అంబటి రాంబాబు, ఉండవల్లి శ్రీదేవి, మేరుగ నాగార్జున, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, సామినేని ఉదయభాను, తెల్లం బాలరాజు, ఎం.ప్రసాదరాజు, విజయవాడలో ఓటమి పాలైన పొట్లూరి వీరప్రసాద్, పార్టీ నేతలు ఇక్బాల్‌ అహ్మద్, బీసీ గరటయ్యతో పాటుగా పెద్ద సంఖ్యలో నేతలు వచ్చారు. తాడేపల్లిలో జగన్‌ నివాసం వద్ద రహదారులన్నీ వాహనాల రాకపోకలతో కిటకిటలాడాయి. 

జగన్‌ను కలిసిన పీసీసీఎఫ్‌ మహమ్మద్‌ ఇలియాస్‌ రిజ్వీ 
ప్రధాన అటవీ సంరక్షణాధికారి(పీసీసీఎఫ్‌), రాష్ట్ర అటవీ దళాల అధిపతి మహమ్మద్‌ ఇలియాస్‌ రిజ్వీ శుక్రవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మర్యాదపూర్వకంగా జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. 

వైఎస్‌ జగన్‌తో సమావేశమైన కొరముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు ​​​​​​​

జగన్‌ నివాసం వద్ద విజయోత్సవాలు 
వైఎస్సార్‌సీపీ ఎంపీగా విజయం సాధించిన నందిగం సురేష్‌ 302 కిలోల భారీ కేక్‌ను కట్‌ చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ నివాసం వద్ద మీడియా పాయింట్‌లో కార్యకర్తలతో కలిసి విజయోత్సాలు నిర్వహించారు. వైఎస్‌ జగన్‌తోనే సువర్ణ పాలన సాధ్యమని ప్రజలు నమ్మారని, అందుకే ఓట్ల వర్షం కురిపించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top