‘ప్రజాసంకల్పం’తో ‘దేశం’ దడ | YCP Tuni MLA Dhadishetti Raju fires on TDP leaders | Sakshi
Sakshi News home page

‘ప్రజాసంకల్పం’తో ‘దేశం’ దడ

Oct 30 2017 9:08 AM | Updated on Aug 10 2018 9:42 PM

YCP Tuni MLA Dhadishetti Raju fires on TDP leaders - Sakshi

తుని: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తానంటూ చేసిన ప్రకటన చూసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, టీడీపీ నేతలకు భయం పట్టుకుందని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తుని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ సీనియర్‌ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వైఎస్సార్‌ సీపీపై చేస్తున్న ఆరోపణలు అసత్యమని, అర్థరహితమని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను శాసనసభలో ముఖ్యమంత్రి, స్పీకర్‌ పథకం ప్రకారం రక్షిస్తున్నారని ఆరోపించారు.

ఇందులో నలుగురిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించి, రాజ్యాంగస్ఫూర్తికి తూట్లు పొడిచినవారు జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభకు వెళ్లకపోవడం బాధ్యతారాహిత్యమంటూ విమర్శలు చేయడం శోచనీయమన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో వారికి ఎవరూ సాటిరారన్నారు. విశ్లేషణ పేరుతో పసుపురంగు పూసుకుని వారు చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం టీవీలు చూస్తున్న జనానికి తెలుసని అన్నారు. గతంలో ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ చేసిన కుట్రనే ఇప్పడు ప్రజాసంకల్ప పాదయాత్ర విషయంలో టీడీపీ అనుసరిస్తోందని ఆరోపించారు.

ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ధైర్యం లేకే..
ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ధైర్యం లేకనే జగన్‌ పాదయాత్రను దొంగదెబ్బ తీసేందుకు దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని రాజా మండిపడ్డారు. ‘శాసనసభకు వెళ్లకూడదని ఏ ప్రతిపక్ష నాయకుడూ, ఎమ్మెల్యేలూ అనుకోరు. ఎంతో కష్టం, నష్టం జరిగితే తప్ప ఇటువంటి నిర్ణయం తీసుకోరు’ అన్నారు. శాసనసభను రాజ్యాంగబద్ధంగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ 20 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్సీలను అక్రమ సొమ్ముతో కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. విప్‌ జారీ చేస్తే అమలు కాకుండా అడ్డుకోవడం, ప్రజా సమస్యలపై గళం వినిపించిన ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్‌ చేయడంలో శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు పాత్ర ఏమిటో అందరికీ తెలుసునన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేల చేతిలో ఓడిపోయిన టీడీపీ నాయకులకు ఎస్‌డీఎఫ్‌ నిధులు ఇవ్వడం అవమానించడం కాదా అని ప్రశ్నించారు.

అవమానాల కోసం సభకు వెళ్లాలా?
‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మంత్రులతో శాసనసభలో మేం అడిగే ప్రశ్నలకు జవాబులు ఇప్పించే దుస్థితిలో కూడా సిగ్గు విడిచి హాజరు కావాలా? సభలో ముఖ్యమంత్రి డ్రామాలు నడుపుతుంటే, రాజ్యాంగంతో సంబంధం లేకుండా నిరంకుశంగా స్పీకర్‌ సహకరిస్తుంటే అవమానాలు భరించడానికి వెళ్లాలా?’ అని రాజా ప్రశ్నించారు. నాదెండ్ల భాస్కరరావు ఎన్‌టీఆర్‌ను దింపేస్తే ఆ రోజు ప్రజాస్వామాన్ని హత్య చేశారన్న నోళ్లకు.. ఈ రోజు 20 మంది వైస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేస్తే ఎందుకు చలనం రావడం లేదని ఆక్షేపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement