MLA Dhadishetti Raju
-
‘ప్రజాసంకల్పం’తో ‘దేశం’ దడ
తుని: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తానంటూ చేసిన ప్రకటన చూసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, టీడీపీ నేతలకు భయం పట్టుకుందని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తుని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వైఎస్సార్ సీపీపై చేస్తున్న ఆరోపణలు అసత్యమని, అర్థరహితమని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను శాసనసభలో ముఖ్యమంత్రి, స్పీకర్ పథకం ప్రకారం రక్షిస్తున్నారని ఆరోపించారు. ఇందులో నలుగురిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించి, రాజ్యాంగస్ఫూర్తికి తూట్లు పొడిచినవారు జగన్మోహన్రెడ్డి శాసనసభకు వెళ్లకపోవడం బాధ్యతారాహిత్యమంటూ విమర్శలు చేయడం శోచనీయమన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో వారికి ఎవరూ సాటిరారన్నారు. విశ్లేషణ పేరుతో పసుపురంగు పూసుకుని వారు చేస్తున్న గోబెల్స్ ప్రచారం టీవీలు చూస్తున్న జనానికి తెలుసని అన్నారు. గతంలో ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ చేసిన కుట్రనే ఇప్పడు ప్రజాసంకల్ప పాదయాత్ర విషయంలో టీడీపీ అనుసరిస్తోందని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ధైర్యం లేకే.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ధైర్యం లేకనే జగన్ పాదయాత్రను దొంగదెబ్బ తీసేందుకు దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని రాజా మండిపడ్డారు. ‘శాసనసభకు వెళ్లకూడదని ఏ ప్రతిపక్ష నాయకుడూ, ఎమ్మెల్యేలూ అనుకోరు. ఎంతో కష్టం, నష్టం జరిగితే తప్ప ఇటువంటి నిర్ణయం తీసుకోరు’ అన్నారు. శాసనసభను రాజ్యాంగబద్ధంగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ 20 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్సీలను అక్రమ సొమ్ముతో కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. విప్ జారీ చేస్తే అమలు కాకుండా అడ్డుకోవడం, ప్రజా సమస్యలపై గళం వినిపించిన ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్ చేయడంలో శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు పాత్ర ఏమిటో అందరికీ తెలుసునన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల చేతిలో ఓడిపోయిన టీడీపీ నాయకులకు ఎస్డీఎఫ్ నిధులు ఇవ్వడం అవమానించడం కాదా అని ప్రశ్నించారు. అవమానాల కోసం సభకు వెళ్లాలా? ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మంత్రులతో శాసనసభలో మేం అడిగే ప్రశ్నలకు జవాబులు ఇప్పించే దుస్థితిలో కూడా సిగ్గు విడిచి హాజరు కావాలా? సభలో ముఖ్యమంత్రి డ్రామాలు నడుపుతుంటే, రాజ్యాంగంతో సంబంధం లేకుండా నిరంకుశంగా స్పీకర్ సహకరిస్తుంటే అవమానాలు భరించడానికి వెళ్లాలా?’ అని రాజా ప్రశ్నించారు. నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ను దింపేస్తే ఆ రోజు ప్రజాస్వామాన్ని హత్య చేశారన్న నోళ్లకు.. ఈ రోజు 20 మంది వైస్సార్ సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేస్తే ఎందుకు చలనం రావడం లేదని ఆక్షేపించారు. -
యనమల అరాచక పాలనకు చరమగీతం తప్పదు
ప్లీనరీలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తుని : అధికారం అండతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు సాగిస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం చామవరం శివారులో ఆదివారం రాత్రి జరిగిన వైఎస్సార్ సీపీ తుని నియోజకవర్గ ప్లీనరీకి ఆయన అధ్యక్షత వహించారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, మాజీ మంత్రి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, 2004కు ముందు టీడీపీకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించుకునే అవకాశం ప్రతిపక్షాలకు ఉండేది కాదన్నారు. ఇప్పుడు గుండెధైర్యంతో ఎక్కడైనా ఎప్పుడైనా సభలు నిర్వహించుకునే అవకాశాన్ని ప్రజలు కల్పించారన్నారు. ఎన్నో కేసులు పెట్టి నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ వెరవక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో వేలాదిమంది తనవెంట నడవడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు. మూడు నియోజకవర్గాలకు సేవలందించే తుని ఏరియా ఆస్పత్రిని టీడీపీ నాయకులు ఆదాయ వనరుగా చేసుకుని పేదల రక్తాన్ని సొమ్ముల రూపంలో పిండుకుంటున్నారన్నారు. తుని నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్, భూములవంటివాటిని విచ్చలవిడిగా దోచుకునేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆర్థిక మంత్రి సొంత గ్రామమైన ఏవీ నగరంలో 105 మందికి చెందిన పింఛన్ల సొమ్మును స్వాహా చేస్తున్నా స్పందించలేదన్నారు. నిజంగా సిగ్గుంటే దీనిపై విచారణ జరిపించి పేదలకు పింఛను సొమ్ము ఇప్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచీ వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో సభాప్రాంగణం కిక్కిరిసింది. టీడీపీని ఎప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారనడానికి ప్లీనరీకి వచ్చిన జనసందోహమే నిదర్శనమని రాజా అన్నారు. కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ప్లీనరీ ఇన్చార్జి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కాకినాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, పెండెం దొరబాబు, ప్రత్తిపాడు పార్టీ కో ఆర్డినేటర్ పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.