ఫలించిన వైఎస్ కృషి | Y.S rajasekhar reddy sucessful effort | Sakshi
Sakshi News home page

ఫలించిన వైఎస్ కృషి

Jan 6 2014 2:50 AM | Updated on Aug 27 2018 9:19 PM

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అయిన గండికోట జలాశయంలోనికి నీరు తెచ్చి జిల్లాతోపాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని రైతులకు సాగు,తాగునీరు అందించేందుకు చేసిన కృషి నేటికి ఫలించిందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.

జమ్మలమడుగు/కొండాపురం,న్యూస్‌లైన్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అయిన గండికోట జలాశయంలోనికి నీరు తెచ్చి జిల్లాతోపాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని రైతులకు సాగు,తాగునీరు అందించేందుకు చేసిన కృషి నేటికి ఫలించిందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గండికోటనుంచి మైలవరానికి రెండు టీఎంసీలనీరు విడుదల చేయాలంటూ  ప్రభుత్వం నుంచి జీఓ రావడంతో ఎమ్మెల్యే ఆది చేత నీటిపారుదలశాఖాధికారులు నీటివిడుదల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మూడుగేట్లను స్వీచ్‌ఆన్‌చేసి ఎత్తించారు. అనంతరం ఆయన విలేకరులతోమాట్లాడుతూ జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో రైతులు వేసిన పంటలు ఎండిపోతుండటంతో  రైతుల పంటలను కాపాడటానికి మైలవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని కోరామన్నారు. అయితే వేసవిలో తాగునీటికోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం నీటిని నిల్వ ఉంచామని కలెక్టర్ వివరించారన్నారు. దీంతో ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి కృష్ణా జలాలను గండికోటకు రప్పించే ప్రయత్నం చేశామన్నారు.
 
 అందులో భాగంగానే గండికోటలో ఉన్న 2.98 టీఎంసీలో రెండు టీఎంసీల నీటిని మైలవరం జలాశయంలోకి విడుదల చేశామన్నారు.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ముంపువాసులకు కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తెచ్చుకునేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ప్రభుత్వం త్వరగా ముంపువాసులకు నష్టపరిహారం చెల్లించి ఇళ్లను ఖాళీ చేయించాలన్నారు. ఇరిగేషన్ అధికారి కె.లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ మూడు గేట్లద్వారా రోజుకు 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు.
 
 రెండు టీఎంసీల నీరు మరో 17రోజుల్లో మైలవరానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఈ జీవనజ్యోతి, మార్కెట్‌యార్డు చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శివనాథరెడ్డి,ఎమ్మెల్యే సోదరుడు శివనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ తనయుడు భూపేష్‌రెడ్డి, అంకిరెడ్డి, వాసుదేవరెడ్డి, రేగడిపల్లె సర్పంచ్ పి.వి.నరసింహారెడ్డి, కొమెర్ల మోహన్‌రెడ్డి, గండ్లూరు నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement