రాజధాని అమరావతికి వివిధ ప్రభుత్వ శాఖల తరలింపునకు అవసరమైన భవనాలను సమకూర్చే బాధ్యతను సీఆర్డీఏ చేపట్టింది.
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతికి వివిధ ప్రభుత్వ శాఖల తరలింపునకు అవసరమైన భవనాలను సమకూర్చే బాధ్యతను సీఆర్డీఏ చేపట్టింది. ఇందుకోసం శనివారం నిర్వహించిన వర్క్షాపులో 150 ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. తమ శాఖలకు అవసరమైన భవనాల వివరాలను సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్కు నిర్దేశించిన నమూనాలో అందజేశారు.
రాష్ట్ర సచివాలయ, కమిషనర్, డెరైక్టర్, ఇతర కార్యాలయాల అధిపతులు తమ శాఖల తరపున పంపిన నోడల్ అధికారులు తమకు కావాల్సిన భవనాల వివరాలను పేర్కొన్నారు.
కృష్ణా నది పక్కన 130 కిలోమీటర్ల పొడవున సీఆర్డీఏ రీజియన్ ఉంటుందని, అసెంబ్లీ, రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం సముదాయాలు 400 ఎకరాల్లో ఉంటాయని ఈ వర్క్షాపులో కమిషనర్ శ్రీకాంత్ చెప్పారు. 2050 నాటికి 62 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయని, ప్రతీ శాఖకు సంబంధించిన కార్యాలయాలు, కార్పొరేషన్లు అన్నీ ఒకేచోట ఉంటాయని ఆయన చెప్పారు.