పనికి తీసుకెళ్లి నరకం చూపించారు.. | Sakshi
Sakshi News home page

పనికి తీసుకెళ్లి నరకం చూపించారు..

Published Mon, Dec 15 2014 2:08 AM

Work showed dragged to hell ..

పార్వతీపురం: పని ఇస్తామని చెప్పి తీసుకెళ్లి తమకు నరకం చూపించారని పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని గుమ్మలక్ష్మీపురం మండలం, మంత్రజోలకు చెందిన పు వ్వల కృష్ణారావు, విశాఖ జిల్లా జీకే వీధి మండలం తడకపల్లికి చెందిన జర్దా చిట్టిబాబులు వాపోయారు. అధిక జీతం, అన్ని వసతులు కల్పిస్తామని తమకు మాయమాటలు చెప్పి... విశాఖపట్నం నుంచి కర్ణాటక తీసుకెళ్లి తమను ఓ దీవిలో చిత్రహింసలకు గురి చేశారని వాపోయారు.

ఈ సందర్భంగా వారు పట్టణంలోని సుందరయ్య భవనంలో మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి, కొల్లి సాంబమూర్తిల వద్ద తమ బాధలు చెప్పుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... తాము విశాఖలో పనిచేసుకునేందుకు వెళ్లామని, అక్కడ పని బాగాలేక ఇంటికి వచ్చే సమయంలో రైల్వేస్టేషన్‌లో ఓ బ్రోకర్ కనిపించి కొవ్వూరులో చేపల చెరువులో రొయ్యల పెంపకం పని ఇప్పిస్తామని, నెలకు రూ.10,000 జీతంతోపాటు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ఒప్పించాడన్నారు.

అనంతరం అక్కడే బొందు నాగరాజు అనే కాంట్రాక్టర్‌కు తమను అప్పగించారన్నారు. ఆతను కొవ్వూరు తీసుకెళ్లి అక్కడ పని ఇవ్వకుండా కర్ణాటకలోని ఆయినొడిగెల్లా తాలూ కా, అంకెల గ్రామానికి ఎదురుగా ఉన్న తుంగభద్ర నదిలోని పాముల దిబ్బ అనే ఓ దీవిలో రాత్రి 8 గంటల నుంచి తెల్లవార్లూ పని చేయించేవారన్నారు. చలిలో నదిలో దిగి బోటు నుంచి విసిరిన వలను నదిలో దిగి నడిపే పని చేయమనేవారన్నారు. ఉదయం, రాత్రి భోజనం పెట్టి, జ్వరమంటే...కర్రలతో కొట్టి, చంపేస్తామని భయపెట్టి చిత్రహింసలకు గురి చేశారని వాపోయారు. తమతోపాటు అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నారని చెప్పారు.
 
ఓ మారు అక్కడ నుంచి కొంతమంది తప్పించుకోవడానికి యత్నిస్తే...రౌడీలను పెట్టి కొట్టించారన్నారు. అందులో ఓ ఆరుగురుం తప్పించుకుని హంసనంది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా కాంట్రాక్టర్ తమ్ముడు రాజు కొంతమంది రౌడీలతో వచ్చి పోలీసుల ముందే తమను చితకబాదారన్నారు. దీనిపై పోలీసులు కూడా పట్టించుకోకుండా వారి దగ్గరకే వెళ్లమ న్నారన్నారు. దీంతో తామంతా భయపడి, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామనగా విడిచిపెట్టారన్నారు.

అక్కడ నుంచి తమ ఇద్దరితో పాటు కృష్ణ, రమణ, లక్ష్మణ తదితరులు తప్పించుకోగా, కొర్ర కామేశ్వర్రావు ఎటు వెళ్లిపోయాడో తెలియదన్నారు. చేత పైసా లేక అక్కడక్కడ కనిపించిన వాహనాలు ఎక్కి చివరకు పార్వతీపురం చేరుకున్నామని వాపోయారు. ఈ విషయమై తాము ఏఎస్పీ, ఐటీడీఏ పీఓ, సబ్-కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నామని మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, సీపీఎం నాయకులు తెలిపారు.

Advertisement
Advertisement