
తూర్పు గోదావరి జిల్లాలో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది.
సాక్షి, పి.గన్నవరం : తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం చిరతపూడిలో సమస్యలపై ఎమ్మెల్యే పూలపర్తి నారాయణమూర్తిని స్థానిక మహిళలు నిలదీశారు. పదేళ్లుగా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు లేవన్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన మహిళలపై ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. మీరు ఓట్లేస్తేనే గెలిచామా అంటూ నోరుపారేసుకున్నారు. దీంతో సమస్యలు చెప్తే ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నించారు. ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తాం మమ్మల్ని ఎవరూ ప్రశ్నించకూడదన్న రీతిలో అధికార టీడీపీ నేతలు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.