
మహిళ హత్య
ఒక మహిళ హత్యకు గురైన దుర్ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బంధువులు, పోలీసులు,
తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్) :ఒక మహిళ హత్యకు గురైన దుర్ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బంధువులు, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బ్రహ్మానందరెడ్డి పండ్ల మార్కెట్ వద్ద సులభ్ కాంపెక్స్ పక్కన చాబత్తుల దుర్గమ్మ (50) నివాసం ఉంటోంది. ఏమైందో ఏమో తెలియదుగాని గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో దుర్గమ్మ నివాసం ఉంటున్న ఇల్లు దగ్ధం కావడంతో చుట్టపక్కల ఉన్నవారు మంటలను ఆర్పేందుకు వచ్చారు. పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.
అప్పటికే సులభ్ కాంప్లెక్స్ వద్ద దుర్గమ్మ శవమై కన్పించింది. ఒంటి మీద దుస్తులు లేకుండా ఉండటంతో పాటు మడత మంచంపై విగతజీవిగా ఉంది. మండత మంచం గుడ్డ సైతం అంటుకుని ఉందని అంటున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మంటలు అంటుకున్న తరువాతే మంచంతో సహా దుర్గమ్మను బయటకు తీసుకువచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. రూరల్ సీఐ జి.మధుబాబు, ఎస్సైలు ఎస్సీహెచ్ కొండలరావు, వి.శ్రీనివాస్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుర్గమ్మను ఎవరో తలపై ఇటుకరాయితో బలంగా మోదడం వల్లే చనిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. తలపై గాయం ఉండటం ఇందుకు కారణంగా చెబుతున్నారు.
అనంతరం వారే ఇంటికి కూడా నిప్పు పెట్టి ఉండవచ్చునని అనుకుంటున్నారు. దుర్గమ్మకు భర్త, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. దుర్గమ్మ భర్త కైకరంలో ఉంటుండగా కుమార్తె చేబ్రోలులోను, ఇద్దరు కుమారులు పట్టణంలో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. దుర్గమ్మ తల్లి రెండు సంవత్సరాలు క్రితం చనిపోవడంతో ఆమె ఒకత్తె ఆ ఇంట్లో ఉంటోందని అంటున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ చేరుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.