కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో ఓ వివాహిత ఆత్మాహుతి యత్నం చేయగా, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది.
ఆగిరిపల్లి : కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో ఓ వివాహిత ఆత్మాహుతి యత్నం చేయగా, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విస్సన్నపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన శిలోను కుమారి(20)కి ఏడాది క్రితం వడ్లమాను గ్రామానికి చెందిన సురేష్తో వివాహం అయింది. వివాహ సమయంలో రూ.2 లక్షల కట్నం ఇచ్చారు. అయితే అదనపు కట్నం కోసం అత్త పార్వతి, మామ బుజ్జయ్య, సమీప బంధువు ఒకరు వేధిస్తున్నారు.
దీంతో కుమారి పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం మొరపెట్టుకుంది. తామొచ్చి మాట్లాడతామని సర్ది చెప్పి కుమారిని తల్లిదండ్రులు అత్తారింటికి పంపించేశారు. ఆదివారం వడ్లమానుకు వెళ్లిన కుమారి రాత్రి సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.