భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
తెలంగాణలో పోలీస్ శాఖలో ఉద్యోగం చేసున్న భర్త
అనుమంచిపల్లి(జగ్గయ్యపేట): తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన చేసిన ఘటన గ్రామంలో ఆదివారం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన బి.పుష్పంకుమార్ తెలంగాణలో పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. 15 ఏళ్ల కిందట ఖమ్మంకు చెందిన విజయలక్ష్మీతో వివాహమైంది. వీరికి సంతానం కలగకపోవడంతో ఓ ఆడపిల్లను దత్తత తీసుకొని పెంచుకొంటున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటంతో వేర్వేరుగా జీవనం సాగించటంతో పాటు విడాకులు తీసుకొనేందుకు కోర్టుకు వెళ్లారు. కేసు కోర్టులో ఉండగా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడని, న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భార్యాభర్తల బంధువుల మధ్య వాగ్వాదం జరగటంతో విజయలక్ష్మీ చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.