కృష్ణా జిల్లా కానుమోలులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
95 మండలాల్లో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
నేడు 21 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం రాష్ట్రంలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కృష్ణా జిల్లా కానుమోలులో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, పల్నాడు జిల్లా శ్రీనగర్లో 45 డిగ్రీలు, ఎనీ్టఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, నేడు (ఆదివారం) 21 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 214 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45, 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42–44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40–42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
⇒ మరోవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని విపత్తుల శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
⇒ కాగా వడగాడ్పులకు శనివారం 8 మంది మృత్యువాతపడ్డారు. ఎనీ్టఆర్ జిల్లాలో ఆరుగురు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు ప్రాణాలు విడిచారు.


