
ప్రత్యేక హోదాపై బాబు మౌనం వీడాలి
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రం ముఖం చాటేస్తున్నా...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మౌనం వీడకపోవడంలో
నరసాపురం అర్బన్ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రం ముఖం చాటేస్తున్నా...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మౌనం వీడకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. అప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఇప్పుడు వంకలు చెప్పడం దారుణమన్నారు. బీజేపీతో దోస్తీ కట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించి కేంద్రంపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ లాంటి సొంత ప్రయోజనాలు ఉన్న అంశాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో నోరు మెదపకపోవడం విచారకరమన్నారు. కేంద్రం కూడా ఏపీకి ప్రత్యేకహోదా కల్పించే విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే, అనేక రాయితీలు, ప్రయోజనాలు పొందడం ద్వారా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు.
జగన్ ఢిల్లీ దీక్ష చారిత్రాత్మకం
ఆంధ్రప్రదేశ్కు మరోసారి జరుగుతున్న అన్యాయంపై జాతీయ స్థాయిలో చర్చ తీసుకు రావడానికి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో ఈనెల 10వ తేదీన జరుప తలపెట్టిన ధర్నా చారిత్రాత్మకమైనదని కొత్తపల్లి పేర్కొన్నారు. ధర్నాకు వేలాదిగా జనం తరలివెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. జగన్ ధర్నాకు ఊహించిన దానికంటే, ఎక్కువగా స్పందన వస్తోందని చెప్పారు. ధర్నాకు మేమొస్తామంటే, మేమొస్తామంటూ వివిధ వర్గాల వారు ముందుకొస్తున్నారని తెలిపారు. రైళ్లలోను, కొంతమంది ఫ్లైట్ల ద్వారా స్వచ్ఛందంగా ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని వివరించారు. ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపైనా, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుపైనా ప్రజలకు ఉన్న అసంతృప్తికి నిదర్శనంగా జగన్ ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద చేయనున్న ధర్నా విజయవంతం అవుతుందని అన్నారు.