ప్రతిసారీ ఎన్నికలు జరిగినప్పుడల్లా అత్యధికంగా ఖర్చు చేసే జిల్లాల్లో పశ్చిమగోదావరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
ప్రతిసారీ ఎన్నికలు జరిగినప్పుడల్లా అత్యధికంగా ఖర్చు చేసే జిల్లాల్లో పశ్చిమగోదావరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బెట్టింగులతో పాటు, డబ్బు పంపిణీ కూడా ఇక్కడ జోరుగా సాగుతుంది. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి మున్సిపల్, లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలోని మొత్తం 8 మునిసిపాలిటీలకు, ఏలూరు కార్పొరేషన్కు ఈనెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల పదో తేదీ నుంచి మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈనెల 13వతేదీ మధ్యాహ్నం 3
గంటల వరకు ఏలూరు కార్పొరేషన్కు నామినేషన్లను స్వీకరిస్తారు. మిగిలిన 8 మున్సిపాలిటీలకు 14వతేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
జిల్లా వ్యాప్తంగా 28.12 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి కొత్తగా 1.70 లక్షల కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు అత్యధికంగా ఖర్చుచేసే జిల్లాల జాబితాలో పశ్చిమగోదావరి అగ్రస్థానంలో ఉండటంతో ఈసారి ఎన్నికల అధికారులు, కలెక్టర్ సిద్దార్థ జైన్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలోను ఎన్నికల కోడ్ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ ఏర్పాటుచేశారు. కంట్రోల్ రూం నెంబరు 08812 230050. ఫ్యాక్స్ నెంబరు 08812 230052