విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణాజిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ప్రారంభమైన రిలేదీక్షలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
సాక్షి, విజయవాడ :
విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణాజిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ప్రారంభమైన రిలేదీక్షలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల నిరాహార దీక్షలు జరుగగా, కలిదిండిలో రాహుల్గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నేతృత్వంలో జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో రిలేదీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కూడలిలో మానవహారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తామూ సమైక్యానికే కట్టుబడి ఉన్నామని చెబుతున్న సీమాంద్ర అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలని డిమాండ్చేశారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తమ పార్టీ రాష్ట్రాన్ని విడదీయకుండా అడ్డుకోవటం ఖాయమని, సమైక్య రాష్ట్రంలోనే త్వరలో ఎన్నికలు జరుగుతాయని ఉదయభాను పేర్కొన్నారు.
విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ పి.గౌతంరెడ్డి నేతృత్వంలో వాంబేకాలనీలో రిలేనిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అవనిగడ్డలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. వీరులపాడు మండలం జుజ్జూరులో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్ష చేపట్టారు. కంచికచర్ల, నందిగామ, చందర్లపాడు మండలాల్లో కూడా రిలే దీక్షలు జరిగాయి. మైలవరంలో పాత ఆస్పత్రి ఎదుట గల వైఎస్ విగ్రహం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్బాబు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అలాగే స్థానిక ఎల్హెచ్ కాంప్లెక్స్ వద్ద గల వైఎస్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. పెడన పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాం ప్రసాదు ఆధ్వర్యంలో దీక్షను చేపట్టారు.
పెనమలూరు సెంటర్లో పార్టీ సమన్వయకర్తలు తాతినేని పద్మావతి, పడమట సురేష్బాబు నేతృత్వలో రిలేదీక్షలు జరిగాయి. గన్నవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరహార దీక్షల్లో పట్టణ కన్వీనర్ సూరం విజయకుమార్తోపాటు పలువురు పాల్గొన్నారు. మైలవరంలో జేఏసీ రిలే నిరాహర దీక్షలు రెండవ రోజు కొనసాగాయి.