ఓర్వలేక విమర్శలు.. ఏపీలో బీజేపీని విస్తరింపజేస్తాం | Sakshi
Sakshi News home page

ఓర్వలేక విమర్శలు.. ఏపీలో బీజేపీని విస్తరింపజేస్తాం

Published Wed, May 27 2015 9:06 PM

we extend bjp in ap

గుంటూరుటౌన్: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు చెప్పారు. బుధవారం గుంటూరు బ్రాడీపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలన ఎలాంటి మచ్చలేకుండా దిగ్విజయంగా ఏడాదికాలం పూర్తిచేసుకుందన్నారు. గత పదేళ్ల కాంగ్రెస్ కాలంలో సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆర్థికాభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ , ఏపీ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అంకిత భావంతో సహకరిస్తుందని చెప్పారు. ఏపీలో ఐఐఎమ్, ఎయిమ్స్‌లాంటి జాతీయ సంస్థల ఏర్పాటుతోపాటు.. రాజధాని నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. బీజేపీ చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్, ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయని చెప్పారు. గతంలో మూడు లక్షలకు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని, ఏపీ, తెలంగాణ కంటే మహారాష్ర్టలో ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ తమ కాలంలో ఆత్మహత్యలు జరిగితే ఇప్పుడు పరామర్శలు చేటయం విడ్డూరంగా ఉందని, ఆయన పశ్చాతాప యాత్రలు చేయాలని సూచించారు.
 

Advertisement
Advertisement