మన జైళ్లు మారాలి | Want Changes in Visakhapatnam Prisons | Sakshi
Sakshi News home page

మన జైళ్లు మారాలి

Jan 30 2019 6:52 AM | Updated on Jan 30 2019 6:52 AM

Want Changes in Visakhapatnam Prisons - Sakshi

రాష్ట్ర హోం మంత్రి చినరాజప్పతో వివిధ రాష్ట్రాల జైళ్ల శాఖ అధికారులు

సాక్షి, విశాఖపట్నం/ఆరిలోవ(విశాఖ తూర్పు): ఖైదీలు జీవితకాలం ఖైదీలుగానే ఉండరు. జైల్లో ఉన్నంతకాలం వారి మానసిక పరిస్థితి మరింత దుర్భరం కాకూడదు. అందుకు అక్కడ వారుండే పరిసరాలు అధ్వానంగా ఉండకూడదు. జైలు నుంచి విడుదలయ్యాక వారి జీవితాల్లో వెలుగులు నిండాలి. ఇందుకు ఏం చేయాలి? ఎలాంటి సంస్కరణలు చేపట్టాలి? జైళ్లలో ఎలాంటి కట్టడాలుండాలి? ఏ డిజైన్లు వారికి సానుకూల వాతావరణానికి దోహదపడతాయి? వంటి ఎన్నో అంశాలపై చర్చించడానికి ప్రిజన్‌ డిజైన్‌పై రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జైళ్ల శాఖ, పోలీస్‌ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రుషికొండలోని ఓ రిసార్ట్స్‌లో రెండు రోజులు జరిగే ఈ సదస్సులో పలు రాష్ట్రాల డీజీపీలు, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, డిజైన్‌ నిపుణులు, సీనియర్‌ ఆర్కిటెక్చర్లు పాల్గొన్నారు. ఖైదీలు నాలుగు గోడల మధ్య మగ్గిపోకూడదని, వారిపట్ల సానుకూల ధృక్పథంతో ఉండాలని, సంస్కరణలు వారికి మేలు చేసేదిగా ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. జైళ్లలో ఖైదీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, సిబ్బందికి కల్పించాల్సిన సంక్షేమం, జైళ్లకు కల్పించాల్సిన రక్షణ తదితర వాటి గురించి వెల్లడించారు. సదస్సుకు వచ్చిన ప్రముఖుల్లో కొందరు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు.

మార్చిలో ఆర్కిటెక్చర్‌ డిజైన్‌పై పోటీలు
దేశంలో రిమాండ్‌ ఖైదీలు పెరుగుతున్నారు. వీరిని, శిక్షలు పడ్డ ఖైదీలను ఒకే జైలులో ఉంచుతున్నారు. దీంతో జైళ్లకు కొత్త సమస్యలెదురవుతున్నాయి. ఖైదీల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇప్పటిదాకా దేశంలోని జైళ్లలో భవనాలు ఒకేలా ఉండేలా జాతీయ విధానమేదీ లేదు. ఇకపై జైళ్లలో ఒకే తరహా డిజైన్‌ భవనాలుండాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మార్చి నెలలో దేశవ్యాప్తంగా ఆర్కిటెక్చర్‌ డిజైన్‌పై పోటీలు నిర్వహించాలనుకుంటున్నాం. వాటిలో ఉత్తమ డిజైన్‌ను ఎంపిక చేసి ఆ తరహాలో జైళ్ల భవనాలు నిర్మించే వీలుంటుంది.– వీహెచ్‌ దేశ్‌ముఖ్, అదనపు డీజీ, బీపీఆర్‌అండ్‌డీ, ఢిల్లీ

జైళ్లలో పరిస్థితులు మారాలి..
1836లో బ్రిటిషర్లు ఇండియన్లకు శిక్ష ఇవ్వాలన్న ఉద్దేశంతో అందుకనుగుణంగా జైళ్లను నిర్మించారు. అప్పట్నుంచి విదేశాల్లో మార్పులొచ్చినా మన దేశంలో మార్పు లేదు. 1894లో ప్రిజనర్స్‌ యాక్ట్‌ వచ్చింది. అప్పట్నుంచి అదే అమలవుతోంది. ఖైదీలు 24 గంటల్లో 18 గంటలు నల్లని గోడల మధ్యనే ఉంటారు. కొన్ని జైళ్లలో 20 ఏళ్ల నుంచి రంగులు వేయని గోడలున్నాయి. ఖైదీల పట్ల మన ఆలోచన మారాలి. జైలు నుంచి బయటకు వెళ్లాక జీవన స్రవంతిలో మనుగడ సాగించాలి. వారికాళ్లపై వారు నిలబడాలి. రిమాండ్‌ ఖైదీలను, శిక్ష పడ్డ ఖైదీలను జైలుకు పంపుతున్నారు. కోర్టులో నిర్దోషని తేలాక తమ పరువు పోయిందని ఎంతో మంది మదనపడుతున్నారు. సమాజంలో వారికి అన్యాయం జరక్కూడదు. అందువల్ల రిమాండ్‌ ఖైదీలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. ఐదేళ్లలో దక్షిణ భారతదేశంలోని జైళ్లను సందర్శించి కొన్ని సూచనలతో రిపోర్టు ఇచ్చాను.             – సంపత్, బీపీఆర్డీ సభ్యుడు

ఆకట్టుకున్న ఖైదీల ఉత్పత్తులు
రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, కడప, నెల్లూరు కేంద్ర కారాగారాల్లో ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను ఈ సదస్సులో భాగంగా ప్రదర్శనకు ఉంచారు. ఇందులో ఖైదీల తయారుచేసిన చేనేత వస్త్రాలు, నోట్‌ బుక్‌లు, జూట్‌ బ్యాగులు, దుప్పట్లు, డెర్రీలు, బిస్కెట్లు, కేకులు, రొట్టెలు, ఖైదీలు వేసిన చిత్రలేఖనాలు ఆకట్టుకున్నాయి. హోం మంత్రి చినరాజప్ప వీటిని ఆసక్తిగా పరిశీలించారు. వాటి ధరలను జైల్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీజీపీ ఆర్‌.వి.ఠాకూర్, రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ జి.జయవర్ధన్, ఉత్తరాంధ్ర రేంజ్‌ డీఐజీ ఇండ్ల శ్రీనిసరావు, నగర కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement